దేశంలోని ప్రాచీన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. సుమారుగా 500 సంవత్సరాల చరిత్ర ఈ ఆలయానికి ఉందని తెలుస్తుంది. ఈ ఆలయంలో గోదాదేవి రంగనాథస్వామి వారితో కలసి దర్శనం ఇస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలంలోని ఏదులాబాద్ అను గ్రామంలో ఆండాళ్ సమేత శ్రీ మన్నారు రంగనాథ స్వామి ఆలయం ఉంది. పచ్చని పొలాల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని అప్పలదేశికాచార్యలు నిర్మించునట్లుగా అక్కడి అర్చకుల ద్వారా తెలియుచున్నది. ఆలయంలో అమ్మవారికి పైభాగంలో శేష శయనం పై పవళించిన శ్రీ రంగనాయకస్వాములవారు దర్శనమిస్తుంటాడు. గర్భాలయానికి ముందు ద్వార పాలకులుగా చండ ప్రచండులు, జయవిజయములు మనకు కనిపిస్తారు. ఈ ఆలయంలో గోధాదేవిని గాజుల ఆండాళమ్మగా పిలుస్తారు.
అయితే ఒక భక్తుడికి స్వప్న దర్శనమిచ్చి అమ్మవారు తమ జాడను తెలియజేసిందనీ, ఆమె ఆదేశం మేరకే ఆ స్వయంభువు విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని స్థలపురాణం చెబుతోంది. ఇక ఆలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కొంతమంది భక్తులకు అమ్మవారు స్వప్నం ద్వారా తెలియజేసిందట. దాంతో వాళ్లంతా కలిసి అమ్మవారి ఆదేశాన్ని అక్షరాలా పాటించారు.
అందుకే ఇక్కడ అమ్మవారు, స్వామివారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నారని భక్తులు విశ్వసిస్తుంటారు. ధనుర్మాసంలో ఇక్కడి గోదా రంగనాయక స్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవించడం వలన ఇంకా కనుల పండుగగా జరిగే వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించడం వలన మనసులోని కోరికలు నెరవేరతాయని చెబుతారు. అంతేకాకుండా స్వప్నంలో అమ్మవారు కనిపిస్తే తమ కోరికను అమ్మవారు నెరవేర్చినట్టుగా భక్తులు భావిస్తుంటారు. పౌరాణిక నేపథ్యం చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయాన్ని ధనుర్మాసంలో దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఇలా స్వయంభువుగా వెలసిన ఆండాళ్ సమేత శ్రీ మన్నారు రంగనాథ స్వామి ఆలయం ధనుర్మాసంలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.