మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి గ్రామానికి గ్రామదేవత ఉంటుంది. ఊరి పొలిమేరలలో వెలసే అమ్మవారు గ్రామాన్ని ఎల్లపుడు రక్షిస్తూ గ్రామదేవతగా ఆరాదించబడుతుంది. అయితే ఇలా మొత్తం 101 మంది గ్రామదేవతలలో పెద్దింటమ్మ వారు పెద్దది అని అందుకే ఈ అమ్మవారిని పెద్దింట్లమ్మవారు అని పిలుస్తారు. మరి ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామంలో పెద్దింట్లమ్మవారి ఆలయం ఉంది. ఈ అమ్మవారిని స్థానిక మత్స్యకారులు వారి కులదైవంగా భావించి పూజలు చేస్తారు. ఈ తల్లి తొమ్మిది అడుగుల ఎత్తు కలిగి, విశాల నేత్రాలతో, పద్మాసన భంగిమలో, డమరుకం, త్రిశూలం మొదలైన ఆయుధాలతో, నాగాభరణం, సూర్య చంద్రాది భూషణాలతో నిండైన రూపంతో భక్తులకి దర్శనం ఇస్తుంది. ఇలా పెద్దింట్లమ్మ వారు అని పిలువబడే ఈ అమ్మవారు పార్వతీదేవి ప్రతిరూపం అని చెబుతుంటారు. అందుకే ఈ అమ్మవారిని కొల్లేటి పార్వతమ్మ అని కొంతమంది భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడి స్థానిక భక్తులు మహిమగల తల్లిగా ఈ అమ్మవారిని నమ్ముతారు. ఇక్కడ వెలసిన ఈ అమ్మవారికి ఎడమవైపున జల దుర్గ మాత ఆసీనులై ఉన్నారు.ఇక ఈ ఆలయం 11 వ శతాబ్దం నాటిదని వేంగి చాళుక్య రాజు ఈ అమ్మవారిని పెద్దమ్మగా కొలిచేవారని చెబుతారు. ఇక్కడ ఉన్న పిఠాపురం శాసనాన్ని బట్టి అగస్త్యుడు కొల్లేరు మధ్యలో ఎత్తైన ఒక పెద్ద దుర్గాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ కోట చుట్టూ 150 రాజహస్తాల వెడల్పు, ఏడు నిలువుల లోతు మూడు కోశాల చుట్టుకొలత గల అధ్బుత అగడ్త ఉండేది. దీనినే ప్రస్తుతం కొల్లేటికోట లంకగా పిలుస్తున్నారు. ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోగా ఒక్క అమ్మవారి ఆలయం మాత్రం ఇప్పుడు ఉంది. ఇది ఇలా ఉంటె విజయనగర రాజులకు మహమ్మదీయులకి జరిగిన పోరులో విజయనగర సామ్రాజ్య సైన్యాధ్యక్షుడు విజయాన్ని ఆకాంక్షిస్తూ తన కన్న కూతురిని కొల్లేటి ఒడ్డున బలి ఇచ్చి విజయాన్ని పొందాడని ఇక అప్పటినుండి ఆ ఒడ్డుకు పేరంటాల కనుమ అనే పేరు వచ్చినదని ఒక పురాణం. ఇలా వెలసిన ఈ అమ్మవారికి కల్యాణాన్ని భక్తులు వైభవంగా నిర్వహిస్తారు. కళ్యాణం తరువాత ఇక్కడ జరిగే రథోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది.