మిర్చీ పేరు వింటేనే నాలుక మీద మంటపుట్టినట్టుగా అనిపిస్తుంటుంది. అందుకే దాన్ని పక్కన పడేసి రంగు కలిపిన కారం పొడి వాడుతారు. కానీ, దానివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు మిర్చీ చేసే మిరాకిల్ గురించి తెలుసుకోవాల్సిందే.
వంటకు రుచిని అందించడం మాత్రమే మిర్చి చేసే పని అనుకుంటే పొరపడినట్టే! జీవక్రియల వేగాన్ని పెరిగేలా చేయడం మిర్చీ ప్రధాన బాధ్యత. మామూలు వంటకాలతో పోలిస్తే మిర్చీవేసి చేసిన వంటకాలు జీవక్రియల వేగాన్ని 50 శాతం పెంచుతాయి. జీరో క్యాలరీలు ఉన్నా పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల షుగర్ సమస్య ఉండదట. పచ్చిమిర్చిని తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందని, రక్తంలో చక్కెర స్థాయిలు 60 శాతం వరకు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.
శరీరంలో ఫైబ్రినాలిటిక్ అనే రసాయన చర్య జరగడానికి మిర్చీలు సహకరిస్తాయి. ఈ చర్య జరగడం వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టే పరిస్థితి రాదు. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
మిర్చీలోని ప్రధాన రసాయనం క్యాప్సియాసిన్ కారణంగానే మిర్చీకి ఆ కారపు రుచి వచ్చింది. మిర్చీ.. రుచిలో మంటెత్తించినా శరీర ఉష్ణోగ్రత సమంగా ఉండటానికి ఈ రసాయనమే కారణం. జీర్ణశక్తిని పెంచుతుంది. వీటిల్లోని ఎండార్ఫిన్లు… మనలోని ఉద్వేగాలని అదుపులో ఉంచుతాయి. మిర్చీలో ఉండే విటమిన్ A, విటమిన్ B6, కాపర్, ఐరన్, నియాసిన్, పొటాషియం, ఫైబర్ ఫోలేట్లు శరీరానికి రక్షణ కల్పిస్తాయి. పచ్చిమిర్చిలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. కళ్లు, చర్మ ఆరోగ్యానికి మిర్చిలోని విటమిన్ సి, బీటాకెరొటిన్లు ఎంతగానో ఉపకరిస్తాయి. రక్తహీనత, ఆస్టియోపొరోసిస్ ఉన్నవారు తాజా పచిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుంది
ప్రొస్టేట్ గ్రంథి సమస్యలకూ పచ్చిమిర్చి మంచి మందులా పనిచేస్తుందట. మిర్చీలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తాయి.