పొడపత్రి చెట్టు ప్రకృతి సిద్ధంగా అడవుల్లోనూ, పొలాల్లోనూ పెరుగు తుంది. పెరట్లోనూ దీన్ని పెంచుకోవచ్చు. ఈ మొక్కనే పుట్టబద్రి మొక్క అని కూడా అంటారు. మధునాశని మొక్క అని కూడా పిలుస్తారు. పొడపత్రి పొదలు పైకి పాకి కనిపిస్తాయి. చిన్న పసుపుపచ్చని పుష్పాలు గుత్తులుగా పూస్తాయి. కాయలు 5 నుంచి 7 సెం. మీ. పొడవు కలిగి ఉంటాయి. ఒకేచోట రెండు జంటగా మేక కొమ్ముల మాదిరిగా అమరి ఉంటాయి. పొడపత్రి మొక్క అడవుల్లో సహజసిద్ధంగా లభ్యమవుతున్నా డిమాండ్ దృష్ట్యా వ్యవసాయ భూమిలోనూ దీన్ని సాగు చేయొచ్చు.
పొడపత్రి మొక్క భారత్, ఆఫ్రికాతోపాటు ఆస్ట్రేలియాలో ఎక్కువగా పెరుగుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ మొక్క ఆకులను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పొడపత్రి మొక్క ఆకుల చూర్ణాన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
పొడపత్రి ఆకుల్లో జిమ్నిమిక్ ఆమ్లం ఉంటుంది. ఇది తీపి రుచిని నివారిస్తుంది. మూత్ర వర్ధకంగా, ఉత్తేజకారిగా, జీర్ణకారిగా, మలబద్ధకం, జ్వరం, ఉబ్బసం నివారిణిగా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. రక్త ప్రసరణ వ్యవస్థను, గర్భాశయాన్ని ఇది స్థిర పరుస్తుంది .రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని సమతులం చేసి, గుండె సంబంధిత వ్యాధులను అరికడుతుంది. ఆస్తమా, మలబద్ధకం, కాలేయ, చర్మ సంబంధ వ్యాధులకు కూడా ఇది చక్కని ఔషధం.
తీపి పదార్థాలను, పిండి పదార్థాలను ఎక్కువగా తినేవారు, వాటిని తినాలనే యావ కలిగి ఉన్నవారు రోజూ పొడపత్రి చూర్ణం తీసుకుంటే మేలు జరుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆయా పదార్థాలను తినాలనే యావ తగ్గుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.
అధిక బరువు తగ్గాలనుకునే వారు పొడపత్రి ఆకు చూర్ణాన్ని తీసుకోవాలి. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించేందుకు ఈ చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వాపులు తగ్గుతాయి. పొడపత్రి ఆకు చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.పొడపత్రి ఆకు చూర్ణాన్ని రోజూ 4 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఆరంభంలో 2 గ్రాములు తీసుకోవాలి. తరువాత మోతాదు పెంచాలి. పొడపత్రి చూర్ణం క్యాప్సూల్స్ అయితే 100 ఎంజీ మోతాదు ఉన్నవి రోజుకు 3-4 సార్లు తీసుకోవచ్చు. ఈ ఆకులతో తయారు చేసిన టీని రోజుకు ఒకసారి తాగవచ్చు.
మధుమేహాన్ని తగ్గించడంలో పొడపత్రి ఆకు అమోఘంగా పనిచేస్తుంది. ఈ ఆకులను రోజుకు ఒకటి రెండు నమిలితే.. షుగర్ లేవల్స్ వద్దన్నా కంట్రోల్ లోకి వస్తాయి. ఈ మొక్కల్లో ఉండే చిన్విక్ యాసిడ్.. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. కాకపోతే పొడపత్రి ఆకులు చాలా చేదుగా ఉంటాయి. నమిలిన 3-4 గంటల వరకు కూడా చేదు అలాగే ఉంటుంది. అయితే.. మధుమేహం లేని వారికి మాత్రమే చేదు రుచి తెలుస్తుంది. ఉన్నవారికి చప్పగా అనిపిస్తుంది.
మధుమేహం ఉన్నవారు ఈ ఆకులను నమలవచ్చు లేదా కషాయంగా చేసుకుని తాగొచ్చు. రోజూ పొడపత్రి కషాయం తీసుకుంటే మధుమేహులు రక్తంలో గ్లూకోస్ని అదుపులో ఉంచుకోవచ్చు. పొడపత్రి చూర్ణం తీసుకున్నా షుగర్ తగ్గుతుంది. ఇందులో యాంటీ డయాబెటిస్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. షుగర్ ఉన్నవారు పొడపత్రి చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.