హయగ్రీవుడు సకల దేవత స్వరూపం. ఈ స్వామిని శ్రీమహావిష్ణువు అవతారంగా కొలుస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల కలిగినవాడు అని అర్ధం. మరి ఆ స్వామి హయగ్రీవ అవతారం ఎందుకు ఎత్తాడు? అశ్వముఖం గల హయగ్రీవుడు దర్శనమిచ్చే ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, చెన్నై లోని రాంనగర్ అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న నంగా నల్లూరులో శ్రీ లక్ష్మి హయగ్రీవాలయం ఉంది. ఈ ఆలయం తూర్పు ముఖంగా నిర్మించబడి ఉంది. ఈ రూపం శ్రీమహావిష్ణువు యొక్క 21 అవతారాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ హయగ్రీవుని నాసిక నుండి ఉఛ్వాస, నిశ్వాసముల నుండి వేదాలు పుట్టినట్లు భాగవత కథ తెలియచేస్తుంది.
ఇక పురాణం విషయానికి వస్తే, పూర్వం ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారాన్ని ధరించి మధుకైటభులను సంహరించి వేదాలను రక్షించాడని పురాణం. ఇంకో కథ ఆధారంగా పూర్వం ఒక రాక్షసుడికి గుర్రం తల అనేది ఉండేది. తన లనే గుర్రపు తల ఉన్న గుర్రపు తల ఉన్న వ్యక్తిలోనే చనిపోవాలంటూ వరాన్ని సంపాదించగా ఆ రాక్షసుడిని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తాడనీ పురాణం.
ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, గర్భాలయంలో అశ్వముఖం గల హయగ్రీవుడు లక్ష్మి సమేతంగా కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయంలోని స్వామివారికి ఏలకులతో కూడిన మాల ప్రీతికరమైనది. లక్ష్మితో కూడిన హయగ్రీవుని సేవించిన విద్యా సంపదలతో పాటు సిరిసంపదలు పొందగలరని భక్తుల నమ్మకం.
ఈవిధంగా శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో ప్రతి గురువారం శ్రావణ నక్షత్రంతో కూడిన తిథినాడు విశేష పూజలు జరుగుతాయి.