Home Unknown facts వినాయకుడు తొండం ఎందుకు వక్రంగా ఉంటుందో తెలుసా ?

వినాయకుడు తొండం ఎందుకు వక్రంగా ఉంటుందో తెలుసా ?

0

సృష్టి చేసి, చేసి అలసిన బ్రహ్మకు, కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్రమత్తులో ఆయన ఆవులించినప్పుడల్లా పర్వతశిఖరాగ్రాలు చిట్లి, అగ్ని వెదజల్లాయి. నిద్రపట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా, ఆకాశంలో గుంపులు, గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో, భయంకరంగా గర్జిస్తూ, ఏనుగు తొండాలవంటి ధారలతో వర్షించి, లోకాన్ని జలమయం చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాఢాంధకారం అలుముకుంది. ఈప్రళయ పరిస్థితిలో బ్రహ్మ నిద్రిం చాడు. ఆయనకు ప్రళయమనేది రాత్రి కాలం. తిరిగి నూతన కల్పారంభంకానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాల రాగ స్వరాలను మెల్లగా పలికిస్తూండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది.

వినాయకుడుపద్మాసనం వేసి కూర్చుని, నాలుగు ముఖాలతో, నాలుగు దిక్కులూ కలియచూశాడు బ్రహ్మ. కిందవున్న జగత్తు అంతా నీటిమాయమై మహాపర్వతాల్లాంటి కెరటా లతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లుకొల్పే తెల్లని కాంతిరేఖ కనిపించింది. ఆ కాంతిలో తరంగా లపై తేలుతూ ఒక చేతులు జోడించి, కన్నులుమూసి ధ్యానించి తెరచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని–బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసింది. కాని ఇప్పుడా పిల్లవాని తల ఏనుగు తలను పోలి, చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుకున్నట్టు కనిపించింది. ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది.

పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు. నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తూన్న మరునిముషంల, ఆకుతోసహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశంలో ఎత్తుగా లేచిన పెద్ద మట్టిదిబ్బ ఒకటి కనిపించింది. క్రమక్రమంగా నీటినుంచి సువిశాలమైన భూభాగాలు సముద్రభాగాలు ఏర్పడ్డాయి. బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలు, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలం లోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు. తరవాత వృక్షాలనూ, సస్యాలనూ, ఖనిజాలను సంకల్పించాడు. పిమ్మట కదలాడే జీవరాశిని మొదట సముద్రంలో చేపలనూ, భూమ్మీద జంతుజాలాన్నీ, క్రిమికీట కాదుల్నీ, పక్షుల్ని సృజించాడు. తరవాత మను ష్యులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు. బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపూ సరస్వతీ దేవి వీణ వాయిస్తూనే ఉంది. ఎందువల్లనో అనుకోనివిధంగా వీణ అపశృతి పలికింది.

సరస్వతి నివ్వెరపోతూ కిందికి చూసి మరింత నివ్వెర పడింది. బ్రహ్మ ,అర్ధాంగి నివ్వెరపాటు అర్థంకాక కమలాసనం నుంచి వంగి కిందికి చూశాడు. పర్వతాలు బోర్లపడుతూ శిఖరాలు భూమి లోకి పాతుకుని వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతున్నాయి. సముద్రతరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతులు వేస్తున్నాయి. కొన్ని పక్షుల్లా ఎగురుతున్నాయి. జంతువులు చాలా అనర్థాలతో పుట్టాయి. తలలు లేకుండా కొన్ని, వెనుక కాళ్ళు లేకుండా కొన్ని, ఒంటికాలివీ, మూడు కాళ్ళవీ, కళ్ళూ, చెవులూ అన్నీ వుండి నోరు లేనివి, తోకలకు తలలున్నవి, తలకు తోకలున్నవి కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు. అవి నడవాలంటే కాళ్ళులేక నేల మీద దొర్లుకుంటున్నవి. ఈ వక్రాలన్ని గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందోనని ఆత్రంగా చూశాడు. మనుషులలో కొందరికి రెండు తలలు ఉన్నాయి. అందులో ఒకటి స్ర్తీది,రెండోది పురుషుడిది. పురుషులు జానెడు, బెత్తెడుగా ఉన్నారు. స్ర్తీలు పెద్ద ఏనుగుల్లాగా, తాటిచెట్లలాగా ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లున్న వాళ్ళు, నాలుగు, మూడు, ఒంటికాళ్ళ వాళ్ళూ, పొట్టకే పెద్దనోళ్ళున్న కబంధుల ఆక్రందనలు చేస్తూ కనిపించారు.

ఇలా సృష్టి చేసినందుకు బ్రహ్మను నిందిస్తూన్నట్లుగా గింజుకుంటున్నాయి. ఒక జానెడు మగవాడు తాటిచెట్టంత వికృతాకారిణి అయిన స్ర్తీని చూపిస్తూ, ‘‘ఓ బ్రహ్మదేవా! ఇలాంటి స్ర్తీతో నేనెలా సంసార సాగరం ఈదేది?”అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. ‘‘నాలుగు తలలంటూ ఉన్నా, అసలు తల అంటూలేని ఓయి బ్రహ్మదేవుడా! మమ్మ ల్నెందుకిలాగ పుట్టించావు?” అంటూ వికృతాకారాల మనుషులు చేస్తూన్న ఆక్రందనలు ఆకాశానికి వినిపిస్తున్నాయి.బ్రహ్మ నాలుగు తలలు గిర్రున తిరిగి పోయాయి. ఎనిమిది కళ్ళు బైర్లుకమ్మాయి. తెల్లబోతూ బ్రహ్మ సరస్వతి వంక అమాయకంగా చూసాడు. అతని నాలుగు తెల్ల మొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకుంది. ‘‘ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనేకదా నేను సృష్టికి పూనుకున్నాను. ఇలా ఎందుకు జరిగింది?” అని తనలోతాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తలలు పైకెత్తి అరిచాడు బ్రహ్మ.

అతని ప్రశ్న దశదిశలా మారుమ్రోగింది. అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుతమూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగు తల ఉంది. నాలుగు చేతులలో పాశం, అంకుశం, కలశం, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు. తెల్లని అతని ఉత్తరీయం ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతుంది. అప్పుడు సరస్వతి వీణ ఓంకారనాదం చేసింది. సరస్వతీదేవి వేళ్ళు వాటంతట అవే వీణపై నాదన్ని పలికిస్తూ, మాయా మాళవ గౌళరాగానికి మారుతూ, హంసధ్వనిరాగాన్ని అందుకున్నాయి. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతని చుట్టూరా శరత్కాల పూర్ణిమ నాటి వెన్నెలలా వెలుగు ఆవరించి ఉంది.

బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, మహానుభావా! అద్భుత మూర్తివైన నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని, అనుగ్రహించు!అని అడిగాడు. బ్రహ్మదేవా! సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూ ఉంటుంది అదే విఘ్నం! విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను! విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్నీ నిండు కలశం లాగ జయప్రదం చేసే విఘ్న వినాయకుడిని.

పంచభూతాలు అనబడే పృథ్వి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూత గణానికి అధిపతినైన గణపతిని. ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనం చేసే మదించిన ఏనుగులవంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశం అనే బలమైన తాటితో కట్టి ఉంచే నన్ను, విఘ్నేశ్వరుడు అని పిలువు! అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు. అప్పుడు బ్రహ్మ, దేవుడు విఘ్నేశ్వరా! నా సృజన శక్తికి ఎందుకలాగ ఘోరమైన విఘ్నం జరిగింది? ఇన్ని వంకరలెందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు! అన్నాడు. విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మర్రి ఆకుపై బాలగణ పతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు.

నా గురించి ఆలోచించడమంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్తపడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే! ఆ జ్ఞాన స్వరూపుణ్ణే నేను! బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతిజీవి పనికి దిగేముందు విఘ్నం రాకుండా జయప్రదంకావడానికి తగు జాగ్రత్తను జ్ఞానాన్నీ కలిగిఉండక తప్పదు! ఏనుగు అడుగు వేసేముందు నేల గట్టితనాన్ని తెలుసుకుని మరీ నడుస్తుంది. ప్రాణుల్లో ఏనుగు బుద్ధి బలం దానిలాగే చాలా పెద్దది.
ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రి స్తూన్న సమయంలో రాక్షసుడైన నరకాసురుడు నీ నాలుగు వేదాల్నీ అపహరించి సముద్రం అడుగున దాచాడు. మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్రశాయినై ఉన్న నా దగ్గర ఉంచాడు.

ఇవిగో! వాటిని తిరిగి గ్రహించి సృష్టి నిర్వర్తించు! అని చెప్పి, విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు. బ్రహ్మ వాటిని అందుకుని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ, విఘ్నే శ్వరా! నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి, మనసారా నిన్ను పూజించి మరీ ప్రారంభిస్తున్నాను ఉపక్రమించేవరం అనుగ్రహించు! అని కోరాడు. విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన వంకరటింకరల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైంది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో, బ్రహ్మదేవుడా! వక్రతను తుండతుండాలుగా ముక్కలు చేసేవాడిని గనుక, నేను వక్రతుండుడు అనే పేరుకు సార్ధకంగా నా తొండం వక్రంగా ఉంటుంది. వక్రతుండుణ్ణి అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన నీ పని కూడా వంకర పోదు అని చెప్పాడు.

Exit mobile version