Home Unknown facts శ్రీ కృష్ణునికి బ్రహ్మకి మధ్య జరిగిన పురాణ కథ ఏమిటి ?

శ్రీ కృష్ణునికి బ్రహ్మకి మధ్య జరిగిన పురాణ కథ ఏమిటి ?

0

చిన్ని కృష్ణుడి లీలలు అన్నీ ఇన్నీ కాదు. యశోద నందనుడు చేసే పనికి ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది. అలాగే చిన్న తనంలోనే బ్రహ్మ కళ్లు తెరిపించాడు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం… అందరి మధ్య నిలబడి కృష్ణపరమాత్మ తనమీద ఉన్న ఉత్తరీయం తీసి, నడుముకి కట్టి అందులోకి వేణువును దోపి, ఆవులను తోలే కర్ర, ఊదే కొమ్ముబూరను ఎడమ చంకలో పెట్టుకుని, ఎడమచేతిలో చద్ది అన్నపు ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ్ళ సందులో పెట్టుకుని దానిని నంజుకుంటూ అన్నం తింటున్నాడు.

శ్రీ కృష్ణుకృష్ణుడు తన చేతిలో పెట్టికున్నది గతరాత్రి వండిన పదార్ధం. నిలవున్న పదార్థం భగవంతుని నివేదనానికి పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉంది. దానికి నిలవ దోషం లేదు. ఆయన యాగభోక్త మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ‘ఓం నమోనారాయణాయ స్వాహా’ అని మంత్రం చెప్పి స్రుక్కు, సృవములతో నేతిని పోస్తే హవిస్సు వేస్తే, అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈరోజు గోపబాలులందరితో కలిసి ఎంగిలి ముక్కలు నంజుకుని తింటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరులు అన్ని లోకాల నుండి వచ్చేసారు. ‘ఏమి ఆశ్చర్యం! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని పరమాత్మ గోపబాలులతో కలిసి స్నానం చెయ్యకుండా ఇంతమంది మధ్య కూర్చుని తాము ఎంగిలిచేసి పెట్టింది తింటున్నాడు. ఏమి ఆశ్చర్యము’ అని వారందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యం చేస్తున్నారు.

దేవతలు అందరూ ఆనందంతో ‘గోవిందా గోవిందా’ అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడ్డాయి. ఈ అల్లరి ఏమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకంనుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూసాడు. బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలులందరితో కలిసి తింటున్నాడు. ‘ఈ ఎంగిలి ముద్దలు ఎడమచేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మా? అఘాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఇతడు బ్రతికించాడా? యాగాలలో తప్ప హవిస్సులు స్వీకరించని పరబ్రహ్మ ఇలా ప్రవర్తిస్తున్నాడా? ఇది నేను నమ్మను. ఆ పిల్లవాడు పరబ్రహ్మ కాదు’ అని అనుకున్నాడు. నేను చతుర్ముఖ బ్రహ్మను ఇంటి పెద్దను. నాలుగు ముఖాలు కలవాడిని. వేదాలు చదివినవాడిని. నామాయ తప్పించుకోలేడు’ అని వెంటనే ఒక మాయ చేసాడు.

అక్కడే నీరు త్రాగి పచ్చిక తింటున్న ఆవులని, దూడలని, ఎద్దులను కొంచెం దూరంగా తీసుకువెళ్ళి మాయం చేసేసి, వాటినన్నిటిని ఒక కొండగుహలో పెట్టేసాడు. అన్నం తింటున్న పిల్లలు కృష్ణా మన ఆవులు, దూడలు కనపడటం లేదని చెపితే నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను. మీరు అన్నం తింటూ ఉండండి’ అని చెప్పి ఆవులను వెతకడానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. వాటి పాదాల జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. ఒకచోట మంద అంతా విడిపోయి వెళ్ళినట్లు కనపడింది. ఆవులు కనపడక పోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపబాలులను మాయం చేసేశాడు. ఇక్కడ చూస్తే గోపాలబాలులు లేరు. అక్కడ ఆవులు, దూడలు, ఎద్దులు లేవు. సాయంకాలం అవుతుంది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలేరి, మా ఆవులేవని అడుగుతారు. అవి ఏమైపోయాయి అని ఒకసారి దివ్యదృష్టితో చూసాడు.

తన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈవేళ మోహబుద్ది పుట్టింది. ఆయన తనమీద మాయ చేసాడని తెలుసుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఒక్కసారి సంకల్పం చేసాడు. ఎన్ని ఆవులు వచ్చాయొ అన్ని ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాలబాలురు అయిపోయాడు. తానే అన్నీ అయిపోయాడు. తానే తనని తోలుకుని అన్నింటితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఒక్కొక్క తల్లిదగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఒక్క కృష్ణుడే ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు ఏ దూడలు, ఆవులు, ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు. ఆ తల్లిదండ్రులు, గోపకాంతలు, గోపాలబాలులని చూసి మా పిల్లవాడే అని మురిసిపోయారు. కృష్ణుడు రోజూ ఇలా గే చేస్తున్నాడు. ఈలోగా త్రుటికాలం కనురెప్ప మూసి తెరచినంతకాల అయింది.

బ్రహ్మగారికి త్రుటి అంటే మనకి సంవత్సరకాలం. సంవత్సరం తరువాత కృష్ణుడు ఏమిచేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలను ఇటు తిప్పాడు. అవే ఆవులు, అవే దూడలు, గోపాలబాలులు ఇక్కడ ఉన్నారు. తాను దాచాడు కదా అని తాను దాచిన గుహను చూసాడు. వారందరూ గుహలో ఉన్నారు. మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడ్డాడు. బ్రహ్మనయిన నేను ప్రాణులన్నింటినీ సృష్టిస్తాను.నేను సృష్టించిన ఆవులు, దూడలు, గోపబాలులు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ వారే అక్కడ ఉన్నారు. అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడయినా ఉన్నాడా’ అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. అది ఖాళీగానే ఉంది. తానే సృష్టికర్తగా ఉన్నాడు. మరి అక్కడ కనపడుతున్న వారెవరా అని ఆలోచించాడు.

బ్రహ్మగారికి గుర్తు వచ్చింది. ‘నన్ను కూడా సృష్టించిన వాడు పరబ్రహ్మ. ఎవని నాభికమలము నుండి నేను పుట్టానో అతడు చిన్నికృష్ణునిగా ఉన్నాడు. వాని మాయముందు నా మాయ ఎంతటిది. నేను దీనిని తెలుసుకోలేక పోయాను’ అని అనుకోగానే ఒక్కసారి మోహబుద్ది విడిపోయింది. చిన్నికృష్ణుని పరబ్రహ్మమును చూద్దామని అటు చూసాడు. చూసేసరికి ఆవులలో, దూడలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుడిలో నాలుగు భుజాలతో, శంఖచక్రగదాపద్మములను పట్టుకొని పట్టు పీతాంబరాలతో శ్రీవత్సముతో కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటముతో, పెద్ద పెద్ద కుంతలములతో, వెలిగిపోతున్న పరబ్రహ్మ అనేకముగా దర్శనం ఇచ్చాడు. ఇన్ని కాంతి పుంజాలను చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు.

ఎందుకిలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేనిమీద పనిచేయ్యదో దానిమీద మాయకమ్మే ప్రయత్నం చేశాను’ అనుకుని ‘స్వామీ! దయచేసి నేను చూడగలిగినట్లు కనపడు’ అని ప్రార్థించాడు. ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. ఈ లీలను చేసింది తానేనని ఒకరోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు.

Exit mobile version