దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక ఆయుధాలు ఉంటాయి. లోక రక్షణార్థం అసురులను ,రాక్షసులను చంపడానికి వాటిని ఉపయోగిస్తారు. అలానే శ్రీహరి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది.
విష్ణువు సుదర్శన చక్రం పొందడానికి శివారాధనే కారణమంటారు. “ఒకానొక సమయంలో దానవమూకలు మహా బలవంతులయ్యారు. త్రిలోకాల్లో వున్న సౌమ్యులందర్నీ ముని – దేవ – మానవులన్న విచక్షణ లేకండా హింసిస్తూ ఉన్నారు. దేవతలంతా విష్ణువు చెంత చేరి దానవులను అణచి వేయవలసిందిగా ప్రార్థించారు. “ఇదంతా కాల వైపరీత్యం! ఇందుకు పరమ శివారాధనమే శరణ్యం” అని వారిని ఆదుకుంటా అని చెప్పి పంపి అఖండ శివదీక్షలో మునిగిపోయాడు.
ఒక గొప్ప అలోచన వచ్చింది వెయ్యికమలాలతో శివ సహస్ర నామాలను అర్చించాలని నిర్ణయించుకున్నాడు. వెయ్యి పువ్వులూ కోసి తెచ్చి పెట్టుకున్నాడు. నామానికొక పుష్పం అర్పిస్తున్నాడు. పరీక్షించాలని శివుడు ఓ పుష్ఫాన్ని కాజేశాడు, మాయమైన పుష్పం సంగతి తొమ్మిది వందల తొంబై తొమ్మిది సంఖ్యకు చేరుకున్నాక గాని (శివునికి ఓ పుష్పం లోటు ఏర్పడిందని) శ్రీహరికి తెలియలేదు.
వెంటనే – లోకులంతా కమలాక్షుడని తనను పిలవడం సంగతి గుర్తొచ్చి, ఆ వెయ్యోనామం అర్చించడానికి తన నేత్రాన్ని పెకలించాలని సిద్ధపడ్డాడు. పరమశివుడు వారిస్తూ ప్రత్యక్షమయ్యాడు. వాస్తవంగా విష్ణువు అర్పించిన వెయ్యి పువ్వులూ అందాయి అని చెప్పి కరుణించాడు. లోక సంరక్షణార్ధం ఇంత సాహసానికి వొడిగట్టిన శ్రీహరిని మనస్ఫూర్తిగా దీవించి తనచే నిర్మితమైన సుదర్శనం అనే చక్రాన్ని ప్రసాదించి, ‘దీనికి ఎదురులేదు! ఎంత మందిని నిర్జించినా – తిరిగి నీవద్దకు చేరుకుంటుంది’ అని అనుగ్రహించాడు. అందువల్లనే ఆయనకు చక్రి అనీ – చక్రధరుడని – చక్రపాణి అనీ పేర్లు వచ్చాయి”.