ధర్మం పక్కదారి పట్టిన ప్రతిసారి లోకంలో ధర్మాన్ని కాపాడటానికి విష్ణు మూర్తి ఒక్కో యుగానికి ఒక్కొక్క అవతారంలో జన్మించి ధర్మాన్ని కాపాడుతూనే ఉన్నాడు. శ్రీహరి ఎన్ని అవతారాలు ధరించాడో తెలుసుకుందాం.
- మత్స్యావతారం :
వైవస్వతమను ఒకనాడు నదిలో సూర్యునికి అర్ఘ్యమిస్తుండగా.. ఒక చేపపిల్ల అతని చేతిలో పడుతుంది. అది పెరిగి పెద్దదవుతుండగా గంగాళంలోను, చెరువులలోను, సరస్సులోను వేశాను. అయినా అది పెరుగుతుండడంతో దాన్ని సముద్రంలో వేశాడు. అప్పుడు ఆ చేప మనుపుతో ‘‘ప్రళయ కాలంలో ఒక నావ వస్తుంది. దానిలో సప్తమహర్షులు, నీవు ఎక్కి కూర్చోండి. ప్రళయాంతం వరకు ఆ నావను మహాసముద్రంలో నా కొమ్ముకు కట్టుకుని, లాక్కొని ప్రయాణం చేస్తూ ఉంటాను ’’ అని చెప్తాడు. మను అలాగే చేసి ఆ ప్రళయాన్ని దాటుతాడు. మళ్లీ బ్రహ్మసృష్టి చేయడానికి పూనుకున్నప్పుడు హయగ్రీవుడనే రాక్షసుడు (ఇతనిని సోమకాసురుడు అని కూడా అంటారు) వేదాలను అపహరించి, సముద్రంలో దాచిపెట్టగా, శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని మళ్లీ ధరించి, వాళ్ళను సంహరించి, వేదాలను మళ్లీ బ్రహ్మ దగ్గరకు చేరుస్తాడు.
2. కూర్మావతారం :
దుర్వాసుని శాపంవల్ల ఇంద్రుడు సంపదలన్ని సముద్రంలో కలిసిపోగా.. విష్ణుమూర్తి సలహా మీద దేవదానవులు సముద్రాన్ని మథించారు. ఈ పాలసముద్రాన్ని మథించడం ప్రారంభించినప్పుడు కవ్వంగా వేసిన మందరపర్వతము మునిగిపోసాగింది. అప్పుడు నారాయణుడు కూర్మావతారం ధరించి, దాని క్రింద ఆధారంగా నిలబడతాడు. దానితో సముద్ర మథనము జరిగి సర్వవస్తువులు, అమృతాలు పుట్టకొచ్చాయి.
3. వరహావతారము :
హిరణ్యాక్షుడు దేవతలను గెలిచి, స్వర్గాన్ని ఆక్రమించేటప్పుడు అతనిని యజ్ఞవరాహ రూపంతో సంహరించెను.
4. నృసింహావతారం :
అతని సోదరుడు హిరణ్యకశిపుడు తరువాత దేవలోకాన్ని ఆక్రమించి యజ్ఞభాగాలను కాజేయగా.. నారసింహరూపం ధరించి అతనిని సంహరించాడు.
5. వామనావతారం :
బలిచక్రవర్తి ఇంద్రుడై దేవతలను స్వర్గంనుండి తరిమివేయగా.. శ్రీహరి వామనుడైపుట్టి.. బలిని మూడడుగుల నేల అడిగి, వామనుడు అవామనుడై రెండడుగులలో భూమి, ఆకాశాలను ఆక్రమించి, అతనిని పాతాళానికి తొక్కేశాడు.
6. పరశురాముడు :
శ్రీహరి తన అంశంతో జమదగ్నికి పరశురాముడై పుట్టి, మదాంధులైన రాజులను ఇరవైఒక్కసార్లు దండయాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరథ రాముని చేతిలో ఓడి తపమునకు వెళ్లిబోయాడు.
7. శ్రీరాముడు :
రావణ, కుంభకర్ణులను సంహరించడానికి దేవతలు ప్రార్థించిన తరువాత దశరథునకు రామునిగా పుట్టి, సీతను పెళ్లి చేసుకుని, సీతాలక్ష్మణులతో అరణ్యవాసం చేసి అనేక రాక్షసులను వధించాడు. రావణుడు సీతను ఎత్తుకుని పోగా, సుగ్రీవుని సహాయంతో లంకకు వెళ్లి రావణకుంభకర్ణ రాక్షసులను సంహరించి, అయోధ్యకు వచ్చి పట్టం కట్టుకున్నాడు. లోకాపవాదానికి భయపడి సీతను అడవిలో వదలగా.. ఆమె వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటుంది. అప్పటికే గర్భవతియై వున్న సీత, అక్కడ కుశలవులను ఇద్దరు కొడుకులకు జన్మనిస్తుంది. రాముడు పదకొండేళ్లు రాజ్యం చేసి, కుశునికి పట్టాభిషేకం చేసి, సీతాసమేధుడై అయోధ్యాపురవాసులతో సహా శరీరాన్ని వొదిలేసాడు.
8. శ్రీకృష్ణావతారం :
ద్వాపరయుగంలో అధర్మప్రవృత్తులైన రాజులవల్ల భూభారం పెరిగినప్పుడు.. భూదేవి కోరికపై శ్రీహరి, కృష్ణావతారాన్ని ఎత్తాడు. దేవకీ, వసుదేవులకు అష్టగర్భమున జన్మించి, రేపల్లెలో నందయశోదల ఇంట్లో పెరిగి, బాల్యక్రీడలతో వారిని అలరించి, దుష్టరాక్షసులను సంహరించాడు. మధురాపురానికి పోయి కంసుని సంహరించి, మాతామహుని రాజ్యాన్ని నిలిపి, బలరామునితో కలిసి శత్రువులను నిర్మూలించాడు. రుక్మిణ్యాది అష్టమహిషులను వివాహం చేసుకుంటాడు.
9. బుద్ధావతారం :
ఒకప్పుడు రాక్షసులు విజృంభించి, దేవలోకంపై దండెత్తి, దేవతలను ఓడించి తరిమివేశారు. దేవతలు ప్రార్థించగా.. మాధవుడు, మాయామోహ స్వరూపంతో శుద్ధోదనుని కుమారుడుగా జన్మించాడు. వేదవిరుద్ధమైన బోధలతో రాక్షసులను సమ్మోహపరిచి వారిని వేదబాహ్యులను చేశాడు. ఒక్క రాక్షసులనే కాక.. భూలోక వాసులను కూడా భ్రమింపచేశాడు. రాక్షసులు బలాన్ని, తేజాన్ని కోల్పోయారు. అప్పుడు దేవతలు వారిని ఓడించి, స్వర్గాన్ని చేజిక్కించుకున్నారు.
10. కల్క్యవతారం :
బుద్ధుని బోధనల ప్రభావం భోలోకంలో వున్న రాజులపై ప్రసరిస్తుంది. వారు అధర్మపరులై ప్రజాకంటకులై ప్రవర్తిస్తారు. ప్రజలు కూడా అన్యాయంగా వేదకర్మలను ఆచరించరు. అప్పుడు కలియుగంలో విష్ణుయశుడనుడికి శ్రీహరి, కల్కిరూపంతో జన్మించాడు. ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించాడు