వరంగల్.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం. క్రీ.శ. 12 – 14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి వరంగల్ రాజధాని. ఓరుగల్లుగా కాకతీయుల ఘన చరిత్రను చాటే ఈ నగరం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చారిత్రక ప్రాంతాలను ఇష్టపడేవారికి ఈ ప్రాంతం తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ కొలువైన కోటలు, ఆలయాలు, కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా, అలనాటి చరిత్రను కళ్ల ముందుంచుతాయి.
తెలుగు రాష్ట్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వరంగల్ పట్టణం పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అక్కడ వెలిసినటువంటి వేయి స్తంభాల గుడి. ఈ ఆలయంలో రుద్రేశ్వర స్వామి వారు కొలువై ఉండి భక్తులను దర్శన భాగ్యం కల్పిస్తారు.
తూర్పు అభిముఖంగా ఉన్న ఈ ఆలయానికి సుమారు 820 సంవత్సరాల చరిత్ర కలిగినదిగా అక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయంలోనికి ప్రవేశించగానే మధ్యలో ఓ మంటపంలో ఆ పరమేశ్వరుడు రుద్రేశ్వరుడుగా కొలువై ఉండి భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు.
అతి పురాతనమైన ఈ ఆలయంలో అత్యంత పెద్దదైన శివలింగంగా రుద్రేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. ఆలయ ప్రాంగణంలోనే కన్యకాపరమేశ్వరి ఆలయం, ఆంజనేయ, వీరభద్ర, నవగ్రహాలు కూడా మనకు దర్శనం కల్పిస్తాయి. క్రీ.శ1194 రుద్రదేవుడు పాలన చేస్తున్న సమయంలో కాకతీయ కొలువులో పనిచేస్తున్న 30 మంది సైనికులు ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. తిరిగి 2006వ సంవత్సరంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది.
తమిళనాడు నుంచి ఎంతో నైపుణ్యం గల శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇది పూర్తి కావడానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది 2012 ఫిబ్రవరి 12న ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. కాకతీయుల శివలింగాన్నే పునఃప్రతిష్ఠించారు.
రుద్రేశ్వరుడుగా ఈ ఆలయంలో ఎన్నో పూజలందుకుంటున్న ఆ రుద్రునికి 41 సార్లు ప్రదక్షణ చేసి, ఆ పరమేశ్వరుడికి ఎదురుగా ఉన్న నంది చెవిలో మన కోరికను చెప్పడం వల్ల ఆ కోరిక కచ్చితంగా నెరవేరుతుందనీ భక్తులు విశ్వసిస్తుంటారు.
కాబట్టి కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు రుద్రేశ్వరున్ని పూజిస్తారు. ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయంలోని స్వామి వారికి ప్రతీ మాస శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఘనంగా ఈ ఆలయంలో జాతర జరుగుతుంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎడ్లబండినీ చక్కగా అలంకరించుకుని స్వామి వారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారు.