ఉత్తరాంచల్ రాష్ట్రం లో కొన్ని పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అందుకే దీనిని దేవభూమి అని పిలుస్తారు. ఈ రాష్ట్రంలోని ఘర్ వాల్ ప్రాంతంలో నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి గంగోత్రి, కేదార్ నాథ్, బదరీనాధ్, యమునోత్రి . ఈ నాలుగు క్షేత్రాలను కలిపి చార్ ధామ్ అంటారు. మరి చార్ ధామ్ యాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఆ నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యమునోత్రి:
చార్ ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి ఆలయాన్ని అక్షయతృతీయ రోజు మే 7 వ తేదీన ఓపెన్ చేసి అక్టోబర్ 27 వ తేదీన మూసివేస్తారు. యమునోత్రి అంటే యమునా నది జన్మస్థలం అని అంటారు. కానీ యమునోత్రి అంటే యమునా జన్మస్థలం కాదు, యమునా ఉత్తర అంటే యమున నేల మీదకు ఉత్తరించిన, అంటే దిగిన స్థలం అని అర్ధం. ఇక్కడ యమునాదేవి ఆలయం ఉంది. ఇది సముద్రమట్టానికి 3293 మీ. ల ఎత్తులో బందర్ పూంచ్ పర్వతం పైన కలదు. ఈ ఆలయ సమీపంలో ఒక ప్రదేశంలో చల్లటి నీరు, సలసల మసిలేనిరు ప్రక్కప్రక్కనే ప్రవహిస్తూ ఉంటాయి. ఇలా ఇక్కడ రెండు ప్రవహించడం అనేది ఇప్పటికి దైవ రహస్యంగానే ఉంది. ఇక ఇక్కడ దివ్యశిల, సూర్యకుండం అనే ప్రదేశాలను తప్పకుండ దర్శిస్తారు.
గంగోత్రి:
చార్ ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి ఆలయాన్ని ఈ ఆలయాన్ని దీపావళి మర్నాడు మూసివేసి తిరిగి అక్షయతృతీయ నాడు తెరుస్తారు. ఈ సంవత్సరం మే 7 వ తేదీన ఓపెన్ చేసి అక్టోబర్ 27 వ తేదీన గంగోత్రి ఆలయాన్ని మూసివేస్తారు. ఇక చార్ ధామ్ యాత్రలో సులభతరంగా చేరగలిగే ప్రదేశం గంగోత్రి. ఈ ప్రముఖ క్షేత్రం ఉత్తరాంచల్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3750 మీ ఎత్తున హిమాలయ పర్వత శ్రేణులలో భగీరథి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం ప్రక్కన ఉన్న కటకాలతో మూసి ఉన్న గది లాంటి దానిలో ఒక చిన్న రాతివేదిక ఉంది. దీనిని భగీరథ శిల అంటారు. ఈ శిలమీదే భగీరధుడు, గంగను గూర్చి తపస్సు చేసాడని స్థల పురాణం తెలియచేస్తుంది. ఈ గంగామాత దర్శనం పాపహరణం అని భక్తులు తలుస్తారు.
కేదార్ నాథ్:
కేదార్ నాథ్ యాత్ర అనేది మే 9 వ తేదీన ప్రారంభం అవ్వగా, అక్టోబర్ 27 వ తేదీన ఆలయాన్ని మూసివేస్తారు. ఇది సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. ఇక్కడ యాత్రలో భాగంగా చూడవలసినవి ఈశానేశ్వర్ మహాదేవ్ ఆలయం, ఆదిశంకరాచార్యుని సమాధి, అగస్త్వేశ్వర మందిరం, రేతకుండము, దూద్ గంగ, పంచ పర్వతాలు, బుగ్గ ఆలయం.
బద్రీనాథ్:
బద్రీనాథ్ ఆలయాన్ని మే 10 వ తేదీన ఓపెన్ చేసి నవంబర్ 9 వ తేదీన మూసివేస్తారు. ఇక గర్హ్వాల్ కొండలలో అలకనందా నదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో బద్రీనాథ్ క్షేత్రం ఉంది. నర నారాయణ కొండల వరసల మధ్య నీలఖంఠ శిఖరానికి దిగువభాగంలో ఉంది. ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించాడు.
ఈవిధంగా మే నెలలో మొదలుకానున్న చార్ ధామ్ యాత్ర పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.