Home Unknown facts శివుడు స్వయంగా పార్వతిదేవికి ఉపదేశించిన నోము

శివుడు స్వయంగా పార్వతిదేవికి ఉపదేశించిన నోము

0

ఒకరోజు పార్వతి దేవి శివుడిని ఇలా అడుగుతుంది… స్త్రీలూ, అజ్ఞాతంగా అంటుకున్న పాపాలు గలవాళ్ళూ, వీళ్ళు తరించి పోయేందుకు ఏదైనా వ్రతం చెప్పమని కోరగా శివుడామెకు లక్షవత్తి వ్రతాన్ని ఉపదేశించాడు. విధి విధానా ఉద్యాపనాదులన్నీ తెలియజేశాడు. అందుమీదట పార్వతి “అంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరు చేశారు? ఆ కథ సెలవీయ” మని కోరగా శివుడిలా చెప్పసాగాడు.

Lord Shivaపూర్వం ఆర్యావర్త దేశంలో లక్షణ అనే ఒక వేశ్య కాంత వుండేది. ఒకనాడామె విహారానికి వెళ్లగా ఒక బ్రాహ్మణుని శవం ముందు హృదయ విదాకరంగా రోదిస్తున్న అతని యిల్లాలిని చూసి అయ్యయ్యో స్త్రీలకు వైధవ్యం అత్యంత దుర్భరం గదా అనుకొని ఒక కోవిదుడైన యాచకుడనే బ్రాహ్మణుని సమీపించి, కుల స్త్రీలకింతటి కష్టం రావడానికి కారణమేమిటని ప్రశ్నించింది. అందుకా యాచకుడిలా పలికాడు.

అమ్మాయీ అనేకానేక జ్ఞాతాజ్ఞాత పాపాలవల్లవే యిలాంటి కష్టాలు కలుగుతాయి. దేవ, పితృకార్యాల్లో ఒక్కోసారి హఠాత్తుగా రజస్వలవుతుంటారు. సంప్రదాయానికి భయపడో, పురుషులేమంటారోననే భయంతోనో, తామున్న ప్రాంతమంతా అషౌచమవడం వలననే అక్కడి విలువైన ద్రవ్యాలన్నీ వృధా అవుతాయనే లోభత్వం వల్లనో, వారు తమ ఇబ్బందిని గోప్యంగానే వుంచుకుని కార్యక్రమాలు సాగిస్తారు. అవన్నీ చెడు ఫలితాలనే యిస్తాయి. ఈ పాపాలే పెరిగి వైధవ్యాన్ని అనుగ్రహిస్తాయి. ఇందుకు విముక్తి మార్గం లక్షవత్తి వ్రతం ఒక్కటే. ఈ వ్రతంలో సువాసినులకు సంపూర్ణమైన మూసివాయినాలీయడం వలన అన్ని దోషాలూ నశిస్తాయి అని యాచకుడు చెబుతాడు.

అది విని లక్షణ ఇందుకేదైన ఋజువున్నదా బ్రహ్మణోత్తమా? అని ప్రశ్నించించి. ఆయన నువ్వే ఋజువు నువ్వీ వ్రతం చేసి, ఫలితాన్ని ఆ విధవరాలికి ధారబోసి చూడు అన్నాడు. వెంటనే ఖర్చుకు వెనుదీయకుండా యాచకుడినే బ్రహ్మగా వరించి వ్రతమాచరించి. ఫలితాన్ని ఆ బ్రాహ్మణ వితంతువుకు ధారబోయగా, మరణించిన ఆమె యింటి బ్రాహ్మణుడు పునర్జీవితుడయ్యాడు. అది మొదలు ఎందరెందరో ఈ వ్రతాన్ని ఆచరించి రజోకారణంగా కలిగే దోషాల నుంచి విముక్తులవుతున్నారు.

ఇది చతుర్మాసంలో విశేష ఫల ప్రదం. ఉదయం నిత్య కృత్యాదులు ముగిశాక సంచగవ్వ ప్రాశనం చేయాలి. వచనం, తర్పణ చేయాలి. అనంతరం గుహ్య సూక్త ప్రకారం 1000 నారాయణ గాయత్రి, పరమాన్నం, నెయ్యితో హోమం చెయ్యాలి. నాలుగు మూలలున్నవేదిక చేసి గోమయంతో అలికి మధ్యలో పంచరంగులతో అష్టదళ పద్మాన్ని వేసి, చెఱకు గడలతో చాందినీ కట్టి, వాటిమధ్య దివ్య వస్త్రం పరచి, అయిదు కుంచాల బియ్యం పోసి మధ్యలో పంచపల్లవ శోభితమైన కలశం స్థాపించాలి. ఆ వస్త్రం మీద లక్ష్మీనారాయణ ప్రతిమను ఆవాహనం చెయ్యాలి. షోడ శోపచారాలతో లక్ష్మీనారయణుల్ని అర్చించాలి. లక్ష వత్తులతో ఆవునేతితో దీపారాధన చెయ్యాలి. రాత్రంతా జాగారం ఉండాలి. 30 ఫలాల ఎత్తుగల కంచుగిన్నె నిండా ఆవు నెయ్యి పోసి, బంగారపు వత్తినీ,వెండి వత్తినీ,ప్రత్తి వత్తినీ ఉంచి మహా దీపారాధన చెయ్యాలి.

భార్య బ్రతికి వున్నవాడూ , భార్యను వదిలి వేయనివాడు, భార్య చేత వదిలి పెట్టబడనివాడూ, దరిద్రుడూ, సంతానాది కుటుంబవంతుడూ శాంతుడూ, మంచి సంతానం గలవాడూ, చదువుకున్నవాడూ అయిన బ్రాహ్మణుడికి వస్త్ర సహితమైన మంటపాన్ని దానమివ్వాలి. బ్రహ్మకు బ్రహ్మ కలశాన్నిచ్చి,తక్కినవాటిని తక్కిన ఋత్వికులకు యివ్వాలి. ఋషి పంచమికి చేసే తతంగమంతా దీనికి చెయ్యాలి. కొందరు దీనిని ఋషిపంచమి నోముకు ఉద్యాపనం కూడా చేస్తున్నారు.

 

Exit mobile version