‘గయ’ త్రిస్థలాల్లో ఒకటిగా కీర్తించబడింది. ప్రయాగ, కాశీ, గయ అనే మూడు క్షేత్రాలను కలిపి ‘త్రిస్థలాలు’ అని అంటారు. పూర్వం ఈ ప్రాంతంలో ‘గయుడు’ అనే రాక్షసుడు వుండేవాడు. అతన్నే గయాసురుడు అని పిలిచేవారు. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన గయాసురుడు తన శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పులుగా పెంచాడు. దీనితో ప్రతివారు గయుడి శరీరాన్ని తాకి మోక్షం పొందడం ప్రారంభించారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి, యమధర్మరాజుకు పనీపాటలేకుండా పోయింది. దీనితో వీరిద్దరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ విషయాన్ని గురించి త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు.
‘గయాసురా! నేను లోకకళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చేయాలి అనుకుంటున్నాను. ఆ యాగం చేసేందుకు అనువైన ప్రదేశం ఎక్కడా భూమండలంలో కనిపించలేదు. నా యాగానికి అనువైన స్థలం, యజ్ఞ జ్వాలల వేడిని తట్టుకునే ప్రదేశం నీ శరీరమే. కాబట్టి నీవు అంగీకరిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని యజ్ఞం చేస్తాను’ అని బ్రహ్మ దేవుడు గయాసురుని అడిగాడు. అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను వుంచి పడుకున్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు. సకల దేవతలు, మహర్షులు అందారూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు, బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞ వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది.
దీనితో బ్రహ్మదేవుడు “మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచండి” అని ఆదేశించాడు. దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచినా తల కదులుతూనే వుంది. ఫలితంగా బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని వుండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువుకు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు, “దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్లనూ, నీ పాదధూళిసోకడం వల్లనూ నా జన్మ ధన్యమైపోయింది.
నా తలపై వుంచిన శిల బరువుకు ఎలా అయినా నేను భూమిలో కూరుకుపోతాను. ప్రజలు ఎవ్వరు ఇకమీదట నన్ను చూడలేరు. అయినా ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా వుంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి” అని గయాసురుడు వేడుకున్నాడు.
గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు ప్రసాదించాడు. ఈ విధంగా గయ పితృదేవతల ఆరాధనకు ప్రత్యేకతను పొందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బ్రహ్మ దేవుడు యజ్ఞ సమయంలో శివుడితో పాటు ఈ ప్రాంతానికి చేరిన పార్వతీదేవి శ్రీమాంగల్య గౌరీదేవిగా కొలువు దీరినట్లు, మహర్షుల పూజలందుకున్నట్లు కథనం.
గయ మూడు నదుల సంగమ తీరంలో వుంది. ఈ క్షేత్రంలో ఫల్గుణీ, మధుర, శ్వేత అనే మూడు నదులు సంగమిస్తూ వుండడం వల్ల ఈ క్షేతం ప్రయాగాతో సమానమైన క్షేత్రంగా చెప్పబడుతూవుంది. ఈ నదుల్లో ఫల్గుణీనది ముఖ్యమైంది. ప్రస్తుతం ఎండిపోయిన ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్తారు.
ఫల్గుణీ నదీతీరంలో “విష్ణుపడమందిరం” కనిపిస్తుంది. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగి వున్న ఈ ఆలయంలో కొలువుదీరిన దేవుడు శ్రీమహావిష్ణువు. ఈయనకే ‘గదాధరుడు’ అని పేరు. స్వామి చతుర్భుజాలను కలిగి శంఖు, చక్ర, గద, వరదహస్తాలతో దర్శనమిస్తాడు. గదను ఆయుధంగా ధరించి గడాధరస్వామిగా పూజ లందుకుంటున్నాడు. ఈ ఆలయ ముఖమండపంలో మనకు పెద్ద పాదాలు దర్శనమిస్తాయి. సుమారు ఒకటిన్నర అడుగు పొడవు, అర్థ అడుగు వెడల్పున్న ఈ పాదాలు గయాసురుడి తలమీద వుంచిన శిలపై నిలబడిన విష్ణుమూర్తి పాదాలుగా చెబుతారు.
ఈ విష్ణుపద మందిరానికి ప్రక్కనే అష్టాదశ శక్తిపీఠ దేవతల్లో పదహారవ దేవత అయిన శ్రీమాంగల్య గౌరీదేవి ఆలయం వుంది. విశాలమైన ఈ ఆలయం లోని గర్భాలయంలో అమ్మవారు దివ్యమైన అలంకరణలతో దర్శనమిస్తుంది. ఈమెకే శ్రీ సర్వమంగళాదేవి అని కూడా పేరు.