హాథీరాంజీ, క్రీ.శ. 1500 కాలంలో ఉత్తర భారత దేశంనుండి తిరుమలకు వచ్చిన భక్తుడు. ఇతడు స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలున్నాయి. పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీరాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం కథ ప్రకారం ఇతనిగురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. అతనిని శిక్షించడానికి ముందు రాజు ఒక పరీక్ష పెట్టాడు. ఒక బండెడు చెరకు గడలు అతనిగదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెఱకు గడలను తినగలిగితే అతనిని శ్రీవారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చి చెఱకు గడలన్నీ తినేశాడు. అప్పటినుండి బావాజీని హాథీరాం బాలాజీ అని పిలువసాగారు. అలాంటి బావాజీ, వెంకటేశ్వర స్వామి వారి బంధం గురించి తెలుసుకుందాం.
ఇప్పుడంటే కొంతమందికి కష్టం వచ్చినపుడే దేవుడు గుర్తొస్తాడు కానీ పూర్వ కాలంలో అలా ఉండేది కాదు. పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాల పట్ల ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరున్ని మెప్పించిన అపరభక్తుడు బావాజీ..
ఆయనతో కలిసి పాచికలు ఆడాడు. తిరుమలలోని మాడవీథులలోని ప్రధాన గోపురానికి కుడివైపున్న మఠం ఆ భక్తుడు బావాజీదే! ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బావాజీతో పాచికలాడుతున్న దృశ్యం వుంటుంది. ఈ మఠాన్ని హాథీరాం మఠం అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం బావాజీ తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నారు. అక్కడ శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా వెళ్లిపోయినా, ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వేంకటేశ్వరుని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం, అర్చకులకు అనుమానాస్పదంగా మారింది. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకపై ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన.. శ్రీనివాసుని దర్శనభాగ్యం కోసం చిన్నపిల్లవాడిలా విలపించాడు. రాత్రింబవళ్ళు కన్నీరుమున్నీరయ్యాడు. అప్పుడు అతనిని ఓదార్చేందుకు సాక్షాత్తూ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం! నేనే రోజూ నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని బావాజీకి అభయమిచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తరువాత, ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు.
అక్కడ వారిద్దరూ పొద్దుపొడిచేవరకూ కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంది. అలా ఒకసారి… బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనేలేదు. సుప్రభాతవేళ సమీపించింది… జగన్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వేంకటేశ్వరుడు వెంటనే లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్లిపోయాడు.
ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవడంతో అది బావాజి మఠంలోనే ఉండిపోయింది. ఆ ఉదయం మూలవిరాట్టుని అలంకరిస్తున్న అర్చకులు, ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వడం గమనించారు. అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకి ప్రవేశించగా… అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు. ఆ ఆభరణాన్ని ఎందుకు, ఎలా దొంగలించావని ప్రశ్నించగా.. తానేమీ దాన్ని దొంగలించలేదని బావాజీ పేర్కొన్నాడు. సాక్షాత్తూ శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని, అర్చకులు రావడంతో హడావుడి ఆలయంలోకి వచ్చేయడంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోని మర్చిపోయాడని వివరించాడు.
కానీ.. ఎవ్వరూ అది నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీకోసం వచ్చిన మాట నిజమే అయితే.. నీకు ఒక పరీక్షను పెడుతున్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి’ అని నవాబు అతనికి పరీక్ష పెడతాడు. ఆరోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి. అవేమిటా అని లోపలికి తొంగిచూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది.
ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు, బండెడు చెరుకుగడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలివాళ్లు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంతవరకూ బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచీ ఆయనకు ‘హాథీరాం బావాజీ’ అన్న పేరు స్థిరపడిపోయింది. హాథీరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించాడు. భక్తికి ఉదాహరణ గా నిలిచాడు బావాజీ.