Home Unknown facts ఆలయ దర్శనానికి ముందు క్షేత్రపాలకుడి అనుమతి తప్పనిసరా?

ఆలయ దర్శనానికి ముందు క్షేత్రపాలకుడి అనుమతి తప్పనిసరా?

0

మన దేశంలోని పవిత్రమైన దేవాలయాలు ఉండే స్థలాలు తిరుమల,శ్రీశైలం, అరుణాచలం, కాశీ… ఇలా ప్రతీ క్షేత్రానికి ఒక పాలకుడు ఉంటారు. ఆయన్నే క్షేత్రపాలకుడు అంటారు. సినిమాల్లో, పురాణాల్లో కూడా క్షేత్రపాలకుడి గురించి చాలా సార్లు వినే ఉంటాం. కానీ అసలు క్షేత్ర పాలకుడు అంటే ఎవరు? అలా ఎందుకు ఉంటారు అనే విషయాల్లో చాలా మందికి సరైన అవగాహన లేదు.

క్షేత్ర పాలకుడుక్షేత్ర పాలకుడు అంటే ఆ క్షేత్రాన్ని పాలించేవాడు, రక్షించేవాడు అని అర్థం. ముఖ్యంగా క్షేత్రాలలోని ఆలయాలకు తప్పకుండా ఈ క్షేత్రపాలకుడు ఉంటాడు. భక్తులు తప్పనిసరిగా ఆ స్వామిని దర్శించుకోవడం క్షేత్ర నియమంగా వస్తుంది. సాధారణంగా క్షేత్రపాలకుడంటే శివుడే అని శైవాగమాలు చెప్తున్నాయి.

వైష్ణవాగమాల్లో కూడా దండపాణిగా శివుడే క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తాడు. శివాలయంలో ఆగ్నేయ దిక్కున ఈ స్వామి ఆలయం ఉంటుంది. భక్తులు ముందుగా ఈయనను దర్శించి శివ దర్శనం.. శివార్చన కొరకు అనుమతి పొందిన తరువాతే ఆలయంలోకి అడుగుపెట్టాలనే నియమం కూడా ఉంది. ఈ నియమం ఒక్క భక్తులకే కాక అర్చనాది కైంకర్యాలు జరిపే అర్చకులకు కూడా ఉంది.

ముఖ్యంగా అర్చకులు శివాలయానికి వేసిన తాళాలను ఈ క్షేత్రపాలకుడి వద్దే ఉంచి వెళ్తారు. ఉదయాన్నే ఆలయం తెరిచే ముందు ఈయన అనుమతి తీసుకొనే అర్చనాది కార్యక్రమాలు మొదలుపెడతారు. ఈశ్వరుడి వెయ్యో అంశగా క్షేత్రపాలకుడు ఉద్భవించినట్లు సుప్ర భేదాగమం చెప్పింది.

లోకరక్షణ కోసం గ్రామానికి ఈశాన్యంలో ఈయనకు ప్రత్యేకంగా ఆలయం కూడా నిర్మించాలని ఆగమశాస్త్ర నియమం. క్షేత్రపాలకుడు నల్లని మబ్బులవంటి శరీరవర్ణంతో, గుండ్రటి కన్నులతో, నగ్నంగా, పదునైన పళ్లకోరలతో, భ్రుకుటిని ముడిచి, ఎర్రటి పొడవైన కేశాలతో, శరీరంపై కపాలమాలలతో, చేతుల్లో త్రిశూలం, కపాలం వంటి ఆయుధాలతో నిలుచుని, భైరవవాహనంతో ఉంటాడు. కాశ్యప శిల్పశాస్త్రం ప్రకారం ఆయన చేతులు, ధరించే ఆయుధాలను బట్టీ సాత్త్విక, రాజస, తామస మూర్తులుగా విభజించారు. క్షేత్రపాలకుడు ఆలయానికి, గ్రామానికి, క్షేత్రానికి ముఖ్యమైన దేవుడనీ, తొలుత ఆయన్ని పూజించిన తరువాతే గ్రామంలోని మిగతా ఆలయాలను దర్శించుకోవాలని శాస్త్రోక్తి.

కొన్ని స్థలమాహాత్మ్యాల్లో మాత్రం శివక్షేత్రానికి విష్ణువు, విష్ణుక్షేత్రాలలో శివుడు క్షేత్రపాలకులని ఉంది. ఉదాహరణకు తిరుమల ఆలయంలో ఈశాన్యంలో క్షేత్రపాలక రుద్రశిల ఉంది. అలాగే గోగర్భం జలాశయం వద్ద ఉన్న ఒక పెద్దరుద్రశిలను భక్తులు దర్శిస్తారు. అలాగే పంచారామ క్షేత్రాలన్నింటికీ విష్ణువు క్షేత్రపాలకుడై ఉన్నాడు. ఇవే కాకుండా భద్రాచలం, కొన్ని నృసింహ క్షేత్రాలకు శివరూపమైన ఆంజనేయస్వామి, శ్రీశైలానికి వీరభద్రుడు, బద్రీనాథ్ క్షేత్రానికి ఘంటాకర్ణుడు, వారణాసి, శ్రీకాళహస్తి, ఉజ్జయిని క్షేత్రాలలో కాలభైరవుడు క్షేత్రపాలకులు.

 

Exit mobile version