వారంలో ఒక్కరోజే మాత్రమే దర్శనమిచ్చే నరసింహ స్వామి వారి ఆలయం

ప్రకాశం జిల్లా , కందుకురుకు నైరుతి దిశలో సుమారు ఇరువై మైళ్ళ దూరంలో ఉన్న ఈ మాల్యాద్రి పై భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన నవనారసింహుల లో ఒకరైన శ్రీ జ్వాలా నరసింహస్వామి తన దేవేరీ శ్రీ మహాలక్ష్మి తో కొలువైయండీ భక్తుల పాలిట కల్పతరువై ఉన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంకాలం పండగ రోజుల్లో ఇంకా ఎక్కువ సమయం దర్శనమిచ్చే దేవతా మూర్తులను మనం ప్రతి దేవాలయంలో చూస్తాం. కానీ వారానికొక్క రోజు మాత్రమే భక్తులమీద వరాల జల్లు కురిపించే దైవం ప్రకాశం జిల్లా, వలేటివారి పాలెం మండలంలో మాలకొండ పై వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామి. ఆ భక్త వత్సలుడు భక్తుల కోరిక మీద అనేక ప్రదేశాలలో అర్చా మూర్తిగా వెలిసి భక్తుల పైగల వాత్సల్యాన్ని నిరూపించుకున్నాడు. అయితే ఇక్కడ స్వామి ఆవిర్భావానికి ఆ శ్రీమహాలక్ష్మి కారణం.

మాల్యాద్రి నరసింహస్వామిఒక రోజు వైకుంఠంలో లక్ష్మీ నారాయణులు ముచ్చటించుకుంటున్న సమయంలో తన దేవేరిని శ్రీమన్నారాయణుడు మనసులో ఏదన్నా కోరిక వుంటే చెప్పమని అడుగుతాడు. దానికి ఆ జగజ్జనని సాక్షాత్తూ లోకారాధ్యుడినే పతిగా పొందిన తనకి వేరే కోరికలేముంటాయనీ, కానీ కలియుగంలో భూలోకవాసులకు భగవన్నామ స్మరణ ముక్తి మార్గమంటారు. ఆ భగవన్నామ స్మరణలో పునీతులవుతూ కొందరు పుణ్యక్షేత్రాలు దర్శించి, అక్కడ తీర్ధాలలో స్నానం చేసి, ఆ దేవతలను దర్శించి తరిస్తున్నారు. అయితే భూ లోకంలో వున్న అతి తక్కువ క్షేత్రాలు దర్శించి మోక్షం పొందటానికి తమ బిడ్డలు వ్యయ ప్రయాసలకోర్వలేకుండా వున్నారని, అందుకని స్వామి దర్శనం తేలిగ్గా పొందటానికి ఒక దివ్య క్షేత్రం సృష్టించమని కోరుతుంది. లోకపావని కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు భూలోకంలో తమ నివాసానికి ఒక అందమైన పర్వతం సృష్టించమని వన దేవతకి చెబుతాడు. ఆవిడ ఇక్కడ ఈ అందమైన పర్వతాన్ని సృష్టించింది.

మాల్యాద్రి నరసింహస్వామిఈ కొండపై నీటి వనరులు, అనేక రకాల పుష్ప, ఫల, ఔషధ జాతి వృక్షాలు, వాటిని ఆశ్రయించిన అనేక పక్షుల కిలకిలారావాలతో, అడవి జంతువులతో భూతల స్వర్గమా అన్నట్టు ఉంది. వన దేవత పుష్ప మాల ఆకృతిలో సృష్టించిందికాబట్టి ఈ కొండని మాలాద్రి అని కొందరంటారు. ఈ కొండకి పడమర దిక్కున అహోబిలం, వాయవ్య దిక్కులో శ్రీశైలం, దక్షిణ దిక్కులో వృషాచల క్షేత్రం, తూర్పు దిక్కులో శింగరాయకొండ .. ఇవ్వన్ని మాల ఆకారంలో అమరి వుండటంతో ఈ కొండని మాలాద్రి అని ఇంకొందరంటారు. ఆ శేషతల్పసాయి తమ భక్తురాలయిన వనమాలను తమ విహారార్ధం భూలోకంలో ఒక కొండని సృష్టించమంటే, ఆ భక్తురాలు ఆ జగజ్జననీ జనకుల పాద స్పర్శకోసం తానే కొండగా మారిందనీ, అందుకే మాలాద్రి అంటారనీ ఇంకొక కధ.

మాల్యాద్రి నరసింహస్వామిఏది ఏమైనా, సుమారు పది చదరపు మైళ్ళ విస్తీర్ణతతో కొన్ని గుహలు, రాళ్ళు ఏ ఆధారం లేకుండా వ్యాపించి వుండటం చూస్తే ఇది దైవ నిర్మితమనిపిస్తుంది ఒక్కొక్క రాతి క్రింద సుమారు రెండు మూడు వందలమంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వున్న గొడుగు బండలు, గుహలు ఇక్కడ చాలా చూడవచ్చు. అంతటి అందమైన ప్రదేశంలో లక్ష్మీ సమేతంగా శ్రీమన్నారాయణుడు నరసింహ రూపంలో విహరించసాగాడు. చతుర్ముఖ బ్రహ్మ రోజూ ఈ కొండకి వచ్చి స్వామిని సేవించేవాడు. అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో ఈ కొండపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిని చూసి, ఈ పుణ్య క్షేత్రం తన తపస్సుకు అనువైనదని, ఇక్కడకొచ్చి, స్వామికోసం కఠోర తపస్సు చేశాడు. ఆయనకి ఒకరోజు సాయంసంధ్యా సమయంలో ఎర్రని రంగు, ఎర్ర పీతాంబరాలు, ఎర్రని ఆభరణాలతో, స్వామి సాక్షాత్కరించాడు. అగస్త్య మహామునికి ఎర్రని కాంతితో జ్వాలా రూపంలో సాక్షాత్కరించాడు కాబట్టి ఆయనకి జ్వాలా నరసింహస్వామి అనే పేరు వచ్చింది.

మాల్యాద్రి నరసింహస్వామిసాక్షాత్కరించిన స్వామిని అగస్త్య మహర్షి భూలోకవాసుల పాపాలు పటాపంచలు చేసి, వాళ్ళని ఉధ్ధరించటానికి అక్కడే జ్వాలా నరసింహరూపంలో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరాడు. అగస్త్యుడు స్వామిని ఇంకొక కోరిక కూడా కోరాడు…తనబోటి మునులు, యక్షులు, కిన్నెరలు, దేవతలు వగైరావారికి స్వామి దర్శనం లభించటంకోసం వారంలో ఒక్క రోజు, శనివారం మాత్రం మానవులకి కేటాయించి మిగతా ఆరు రోజులు ఋషి పూజలు అంగీకరించమని, అలా చేస్తే అటు దేవతలు, మునిగణాలకు ఆయన దర్శన భాగ్యం లభిస్తుందనీ, ఇటు మానవులుకూడా స్వామిని సేవించి తరిస్తారనీ వేడుకున్నాడు. భక్తుని కోరికను మన్నించిన శ్రీ నరసింహస్వామి అక్కడ జ్వాలా నరసింహస్వామిగా వెలిశాడు. అప్పటినుంచీ యుగ యుగాలుగా కోట్లాది భక్తులు దుర్గమంగా వున్న ఆ కొండ ఎక్కి ప్రతి శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరిస్తున్నారు. మిగతా ఆరు రోజులూ ఇక్కడ స్వామిని సేవించటానికి దేవ, మునిగణాలు వస్తాయని అంటారు.

మాల్యాద్రి నరసింహస్వామితర్వాత కాలంలో దీనిని నమ్మని కొందరు స్వామి దర్శనాన్ని ప్రజలకు ప్రతి రోజూ కల్పించాలని అనేకసార్లు ప్రయత్నించారుగానీ, వారి ప్రయత్నాలు ప్రతిసారీ విఫలమయ్యాయి. ఈ మాల్యాద్రి మీద అనేక తీర్ధాలున్నాయి. పూర్వం మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుని వల్ల ఈ గిరి ప్రాశస్త్యాన్ని గురించి విని రోజూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించసాగాడు. ఈ స్వామిని సేవించి తరించినవారి కధలు ఎన్నో వున్నాయి. ఒకసారి భానుమానుడనే రాజు మాల్యాద్రి వైభవంగురించి విని తానుకూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరించాలనే ఆశతో మాల్యాద్రికి వచ్చాడు. అయితే అక్కడ పూజారి లేడు. అర్చకుడు లేని పూజ నిష్ప్రయోజనమని బాధపడి భానుమానుడు ఆ రోజంతా నిరాహారంగా అక్కడే వుండిపోయాడు. మరునాడు స్వామినర్చించటానికి బ్రహ్మదేవుడు రాగా, స్వామి ఆయనతో భానుమానుడు నా దర్శనార్ధం వచ్చి నా సేవకోసం నిరాహారుడుగా వేచిచూస్తున్నాడు. అర్చకుడు లేని కారణంగా ఆ రాజు నన్ను సేవించటం కుదరలేదు.

మాల్యాద్రి నరసింహస్వామికాబట్టి నువ్వు వెంటనే ఒక అర్చకుడిని సృష్టించి, శనివారంనాడు మాత్రం మానవ పూజకై కేటాయించి, మిగతా వారాలలో దేవ, ఋషి పూజలు జరిగేటట్లు ఏర్పాటు చెయ్యమని ఆనతిచ్చాడు. బ్రహ్మదేవుడు తన సంకల్పంచేత నృసింహాచార్యుడనే సకల శాస్త్రవేత్త, భక్తి తత్పరుడైన బ్రాహ్మడుని సృష్టించి ఆయన ప్రతి శనివారం మానవులకోసం పూజాదికాలు నిర్వర్తించేటట్లు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజునుంచీ, ఈ రోజువరకూ ప్రతి శనివారం మాల్యాద్రి పై శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రజలు సేవించి తరిస్తున్నారు. దేవతలకు కూడా అలకలూ, ఈర్ష్యాసూయలూ వుంటాయా? ఏమో!? వున్నాయని చెప్పే కధలు మాత్రం అక్కడక్కడా వున్నాయి. అలాంటిదే ఈ కధ. ఇక్కడ పూర్వం స్వామితో వున్న లక్ష్మీదేవి ఒకసారి స్వామి మీద అలిగి కొండపైకి వెళ్ళిందట. వెళ్ళేదారిలో పెద్ద బండరాయి అడ్డుగా ఉంది. దేవి ఆగ్రహానికి ఆ బండ పగిలి, పెద్ద చీలికలా ఏర్పడి, అమ్మవారు కొండమీదకి వెళ్ళటానికి త్రోవ ఇచ్చిందిట. ఇప్పటికీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించాలంటే ఆ త్రోవలో కొండపైకి దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే. బండ చీలికలా ఏర్పడితే వచ్చిన త్రోవగనుక కొంత ఇరుకుగా వుంటుంది. ఆ త్రోవను చూస్తే స్ధూలకాయులు వెళ్ళలేరనిపిస్తుందిగానీ, వారుకూడా ఏ ఇబ్బందీ లేకుండా తేలికగా వెళ్ళగలగటమే ఇక్కడి అద్భుతమంటారు.

మాల్యాద్రి నరసింహస్వామిగోవర్ధనగిరి పేరుకు తగ్గట్లే కృష్ణుడు చిటికెన వేలుతో ఎత్తిన గోవర్ధనగిరిలాగే వుంటుంది. దీనికింద విశ్రమించేవారు, పొంగళ్ళు వండేవారు, కనులపండుగైన దృశ్యం అక్కడ ఉంటుంది. శివకేశవులకు బేధం వుండదని పెద్దలు చెప్పే మాటను గుర్తుచేస్తూ ఇక్కడ ఒక గుహలో శివాలయం ఉంది. దానికి కొంచెం దిగువకి వెళ్తే పార్వతీ దేవి ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు పొంగళ్ళు వండి స్వామికి నైవేద్యం పెడతారు. దీనికోసం వారికి ప్రత్యేక స్ధలాలు కూడా కేటాయించారు.వైశాఖ శుధ్ధ చతుర్దశినాడు వచ్చే సృసింహ జయంతికూడా ఈ దేవస్ధానంలో ఆ రోజు శనివారం కాకపోతే తర్వాత వచ్చే శనివారంనాడే చేస్తారు. ఇక్కడ చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో పిండి ప్రమిదలలో దీపం వెలిగిస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసం, శ్రావణ మాసాలలో భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఈ స్వామిని సేవించిన అనేక ప్రఖ్యాత రాజులలో విజయనగర ప్రభువు అచ్యుత దేవరాయలు, రెడ్డి రాజులు వగైరా రాజులు కూడా వున్నారు.

మాల్యాద్రి నరసింహస్వామిఈ ఆలయంలో ప్రత్యేకత విషయానికి వస్తే ప్రతి శనివారం ఉదయం 6 గం. ల నుంచీ, సాయంత్రం 5 గంటలదాకా మాత్రమే. సాయంకాలం 5 గం. లయితే స్వామికి అలంకరించిన పూలతో సహా తీసి, ఆలయ ప్రాంతాలు పరిశుభ్రం చేసి ఆలయం మూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ కొండదిగువకు వచ్చేస్తారు. కొండ కింద అన్ని వసతులతో 12 గదులు, సాధారణ వసతితో 30 గదులు, డార్మెటరీ సౌకర్యాలు వున్నాయి. టి.టి.డీ. వారి కళ్యాణ మండపంలో వివాహాలు జరుగుతాయి. భక్తులు ఇక్కడ కేశ ఖండన కూడా చేయించుకుంటారు. దానికి తగిన సదుపాయాలున్నాయి.

ఈ ఆలయానికి వెళ్లే మార్గం :

ఒంగోలు నుండి 80 కి.మీ. లు, కందుకూరునుండి 32 కి.మీ.లు, శింగరాయకొండనుంచీ 40 కి.మీ. ల దూరంలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని చేరుకోవటానికి ఒంగోలు, కందుకూరునుంచి పామూరు వెళ్ళే బస్సులన్నీ కొండ దిగువదాకా వెళ్తాయి. అక్కడనుండి కొండపైకి ఆటోలు లభిస్తాయి. కందుకూరు, శింగరాయకొండలనుంచి ఆటోలలో కూడా వెళ్ళి రావచ్చు. సమయం తక్కువ వున్నవాళ్ళు వెళ్ళి రావటానికి వాహనం మాట్లాడుకుంటే ఇబ్బంది లేకుండా వుంటుంది. కొండ ఎక్కటానికి మెట్ల దోవలు వున్నాయి. మెట్లు ఎక్కలేనివారికోసం ఘాట్ రోడ్డు నిర్మించబడింది. ఈ మార్గంలో కార్లు, ఆటోలు వెళ్తాయి. ఈ రోడ్డు చిన్న చిన్న మెలికలతో వుంటుంది. కొండపైన వాహనం ఆగిన చోటనుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళటానికి వయోవృధ్ధులు, చిన్న పిల్లలున్నవారికోసం ఆలయం వారు నిర్వహించే ఉచిత రవాణా సౌకర్యం కూడా వున్నది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR