పూర్వం ఒకానొక సందర్భంలో రజతగిరి కైలాసపర్వతం మీద నటరాజు (శివుడు) తాండవ నృత్యం చేయాలని నిర్ణయించుకున్నాడు. పార్వతి దేవి ఆ కార్యానికి అధ్యక్షత వహించింది. దేవ గణం అందరూ ఈ నృత్యం చూడటానికి వచ్చారు. కొద్ది క్షణాల్లోనే శివభగవానుడు భక్తి పారవశ్యంతో తాండవ నృత్యం ఆరంభించాడు. సమస్త దేవగణం, ఇంకా దేవతా స్త్రీలు కూడా ఆ నృత్యంలో సహాయం చేస్తూ వివిధ వాద్యాలను వాయించసాగారు.
శివభగవానుడు ఆ ప్రదోష కాలంలో సమస్త దివ్య శక్తుల సమక్షంలో అత్యద్భత తాండవ నృత్యాన్ని ప్రదర్శించారు. అందరూ శంకరభగవానుని నృత్యాన్ని కీర్తించారు. ఆదిపరాశక్తి (మహాకాళి) ఆయనపై అత్యంత ప్రసన్నురాలైంది. ఆమె శివునితో “భగవాన్! ఈరోజు మీ నృత్యాన్ని చూసాక నాకు చాలా ఆనందం కలిగింది. నేను నీకు ఏదైనా వరాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను.” అని పలికింది.
ఆమె మాటలకు శంకరుడు ” దేవీ” ఈ తాండవ నృత్యాన్ని చూసే అదృష్టం, ఆనందం భూలోక జీవులకు లేకుండా పోతోంది. మన భక్తులు కూడా ఈ సుఖాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి భూమి మీద ఉన్న జీవులకు కూడా ఈ నృత్య దర్శనభాగ్యం కలిగేలా అనుగ్రహించు అని విన్నవించాడు. శివభగవానుని విన్నపాన్ని మన్నించి వెంటనే ఆదిశక్తి సమస్త దేవతలను విభిన్న రూపాలలో భూమండలం మీద అవతరించాల్సిందిగా ఆదేశించింది.
స్వయంగా ఆమె శ్యామసుందరుడు శ్రీకృష్ణ భగవానునిగా అవతరించి బృందావన ధామానికి విచ్చేసింది. శివభగవానుడు మధురానగరిలో రాధగా అవతారమెత్తాడు. ఇక్కడ వారిరువురూ కలిసి దేవతలకు సైతం దొరకని అలౌకిక రాస నృత్యాన్ని ప్రారంభించారు.