భారతదేశంలో వుండే అతి ప్రాచీన నగరాలలో కాశీ ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయి. దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. అలానే భాగీరధి నది గంగ నదిగా పిలుస్తున్న ఈ పవిత్రస్థలాన్ని ఉత్తరకాశి అని అంటారు. మరి ఉత్తరకాశి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉత్తరకాశి అనే పేరు రావడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాంచల్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లా లో హృషీకేశ్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో శ్రీ కాశి విశ్వనాథ ఆలయం ఉంది. ఈ ప్రాంతం భాగీరధి నది ఒడ్డున ఉంది. ఈ నది ఇక్కడి నుండి కొంతదూరం ముందుకు వెళ్లిన తరువాత మందాకిని నది వచ్చి భాగీరధి నదిలో కలుస్తుంది. ఇక్కడ ఉన్న భాగీరధి నదిని గంగ నది అని పిలుస్తారు. వారణాసి లో కాశి క్షేత్రం వరుణ, ఆసి అనే నదుల మధ్య ఉన్నట్లుగా, ఈ ప్రాంతం కూడా రెండు నదుల మధ్య ఉండటం వలన ఈ పుణ్యస్థలాన్ని ఉత్తరకాశి అని అంటారు. ఇంకా కాశి విశ్వేశ్వరుడి ఆలయాన్ని మహమ్మదీయులు ధ్వంసం చేసినప్పుడు ఆ ఆలయంలో ఉన్న శివలింగాన్ని తీసుకువచ్చి ఈ ఆలయంలో దాచారని అందుకే ఇక్కడ వెలసిన స్వామివారి పేరు కూడా కాశీవిశ్వనాథుడని, ఈ ప్రాంతాన్ని ఉత్తరకాశి అని పిలుస్తున్నారని తెలియుచున్నది.
ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయానికి ఎదురుగా ఒక చిన్న ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని శక్తి ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయంలో 26 అడుగుల త్రిశూలం ఉంది. రాతితో చెక్కబడిన 15 అడుగుల ఎత్తుగల ఒక ఇత్తడి తొడుగుతో స్తంభం ఉండగా ఆ స్థంబానికి కిందనుండి పై వరకు ఎర్రటి వస్త్రం చుట్టి ఉండగా ఆ స్థంభం పైన ఇత్తడితో చేయబడిన త్రిశూలం ఉంది.
ఈ ఆలయానికి కొంతదూరంలో ఒక గ్రామం ఉండగా అక్కడ అందరు సాదువులే నివసిస్తుంటారు. ఇంకా ఇక్కడ ఉన్న అడవుల్లో జమదగ్ని ఆశ్రమం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే అడవిలో చాలాదూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాశి విశ్వనాథ ఆలయమే కాకుండా గంగోత్రి, యమునోత్రి, శని దేవుడి ఆలయం, కర్ణదేవాత ఆలయం, భైరవ ఆలయం వంటివి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నవి.