మన పురాణాల్లో యమ ధర్మరాజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. యుగాలు మారినా, ఎంతటి వారైనా యముడికి బయపడాల్సిందే. మనం పాపాలు చేస్తే ఆ పాప పుణ్యాల లెక్కలు యమపురిలో తేల్చుతారు అనే భయం కూడా చాలా మందికి ఉంటుంది. అలాంటి యమధర్మరాజు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
నరక లోకాధిపతి యముడిని యమధర్మరాజు అని పిలుస్తారు. ఎందుకంటే యముడు ఎటువంటి పక్షపాతం చూపించకుండా ఎల్లవేళలా ధర్మ నిబద్ధుడిగా ఉంటాడు. మరి ఆ ఎవరి పుత్రుడు అంటే సర్వ లోకాలకు కాంతిని పంచే ఆ సూర్యుని కుమారుడు. వైవస్వతుడికి, శని భగవానుడికి, యమునకు సోదరుడు.
దక్షిణ దిశకు అధిపతి అయిన యముడు భూలోకంలో పాపుల పాపాలను లెక్క వేస్తాడు. దున్నపోతు వాహనమునధిరోహించి చేతిలో ఉండే కాలపాశముతో సమయము ఆసన్నమైనపుడు ప్రాణాలు తీస్తాడు. పాపుల చిట్టా చూసే పని మాత్రం ఆయన పక్కన ఉండే చిత్రగుప్తుడు చూసుకుంటాడు.
యముడు నివశించే నగరం యమపురిగా చెబుతారు. భూలోకంలో మొట్టమొదట మరణము పొంది, పరలోకమునకు వెళ్లిన వాడే యముడు అని పురాణాల్లో తెలిపారు. మనుషులు యముడికి భయపడతారు అనేదాంట్లో నిజం ఎంతున్నా మన దేశంలో కొన్ని చోట్ల యముడికి గుడికి కట్టి పూజలు చేసేవారు కూడా ఉన్నారు.