త్రిమూర్తులలో ఒకరు పరమశివుడు. మన దేశంలో ఎన్నో అతి పురాతన శివాలయాలు అనేవి ఉన్నాయి. మనకి ఆ పరమశివుడు లింగరూపంలో దర్శనం ఇస్తుంటాడు. శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే కొన్ని ఆలయాలలోని శివలింగానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అయితే మన దేశంలో అతిపెద్ద శివలింగాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ అతిపెద్ద శివలింగాలు అనేవి ఎక్కడ ఉన్నాయి? ఆ శివలింగాల గురించి కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కోటి లింగేశ్వరాలయం:
కర్ణాటక రాష్ట్రంలో కోటిలింగేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో 108 అడుగుల ఎత్తు గల అతిపెద్ద శివలింగం ఉంది. ఇంత పెద్ద శివలింగం ముందు 35 అడుగుల పొడవు ఉన్న నంది విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు ఇచట శివలింగాన్ని కూడా ప్రతిష్టించవచ్చు. ఇలా ఈ ఆలయంలో ఇప్పటికి మొత్తం దాదాపుగా 8.6 మిలియన్ శివలింగాలు ఉన్నాయని చెబుతారు.
భోజేశ్వర్ ఆలయం:
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోజేశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతమని చెప్పవచ్చు. అయితే కొన్ని కథల ఆధారంగా ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలోని శివలింగం 17.8 అడుగుల చుట్టుకొలత, 7.5 అడుగుల ఎత్తు ఉండి, 21.5 అడుగుల చదరపు స్థలం మీద నిర్మించబడింది. ఈ శివలింగం ఉన్న ప్లాట్ ఫార్మ్ సున్నపురాయితో తయారుచేయబడింది.
అమరేశ్వర్ మహాదేవ్ ఆలయం:
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో 11 అడుగుల పొడవైన శివలింగం ఉంది. ఈ శివలింగం ఒకే రాతితో నిర్మించబడింది. ఇంకా 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు, జలపాతాలు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆకట్టుకుంటాయి.
సిద్దేశ్వరనాథ్ ఆలయం:
ఈ ఆలయం అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం 25 అడుగుల పొడవు, 22 అడుగుల ఎత్తు ఉన్నదీ. ఇక్కడ విశేషం ఏంటంటే శివలింగం దగ్గర ఎప్పుడు కూడా నీటి ప్రవాహం అనేది ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో పార్వతీదేవి, వినాయకుడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
బృహదీశ్వరాలయం:
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఈ బృహదీశ్వరాలయం ఉంది. ఇది అతి ప్రాచీన పురాతన శివాలయం. ఈ ఆలయంలోని శివలింగం ఏకశిలా నిర్మాణం. గర్బాలయంలో ఉన్న శివలింగం అధ్భూతంగా పూర్తిగా నల్ల రాయితో చేయబడిన పదహారడుగుల ఎత్తు 21 అడుగుల కైవారం కలిగి చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఈ స్వామికి అభిషేకం చేయడానికి విగ్రహం పక్కనే ఎత్తుగా కట్టబడిన మెట్లు ఉన్నాయి. ఈ శివలింగ విగ్రహాన్ని చెక్కిన శిలకోసం ఎన్నో చోట్ల వెతికి చివరకు నర్మదానదీ గర్భములో నుండి సంపాదించినట్లు తెలుస్తుంది. ఈ శిలను వెలికి తీసి శివలింగంగా చెక్కి తీసుకురావడానికి రాజరాజ చక్రవర్తి తానే స్వయంగా దగ్గర ఉండి 64 మంది శిల్పులతో ఆ శిలని శివలింగంగా మలిచి ఏనుగుల చేత మోయించుకొని వచ్చాడంటా.
హరిహర్ ధామ్ ఆలయం:
ఈ ఆలయం జార్ఖండ్ లో ఉంది. ఈ ఆలయంలోని శివలింగం 65 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా కూడా పేరు గాంచింది. ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ సమయంలో ఎక్కడి నుండో శివభక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి.
అమర్నాథ్ ఆలయం:
ఈ అమరనాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ఇది ప్రధానంగా గుహ దేవాలయంగా వుంది. ఇది సంవత్సరంలో నిర్దిష్టమైన సమయంలో మాత్రమే కనిపించే శివలింగం. ఈ శివలింగం స్వయంగా మంచుగాడ్డతో సృష్టించబడ్డ శివలింగమై అత్యంత ప్రసిద్ధిగాంచినది. ఈ ఆలయం వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ శివలింగం యొక్క ఎత్తు దాదాపుగా 20 అడుగులు ఉంటుంది.
భూతేశ్వర్ టెంపుల్:
ఈ ఆలయం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడి శివలింగం కి ఉన్న విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఈ శివలింగం 6 నుండి 8 ఇంచులు పెరుగుతుందని చెబుతున్నారు. ఇక్కడి శివలింగం భారీ సహజ లింగంగా పేరుగాంచింది.