మహాభారత గ్రంధకర్త అయిన “వేదవ్యాస మహర్షి” జన్మించినది. ఆషాడ పౌర్ణమినాడు.ఈ వ్యాసుడు, పరా శరముని వలన, సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకనే ఈ రోజును “వ్యాసపౌర్ణమి” మరియు “గురుపౌర్ణమి” అని కూడా అంటారు. మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరచాడు. (ఋగ్గ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం).
నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ యుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం, కృత యుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో2 పాదాలతో, ఈ కలియుగంలో 1 పాదంతో, నడుస్తుంది. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.
వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖము నుండి వేలువడినదే వేదము. అందుకే అతనిని వేదపురుషుడు అని అంటారు. వేదములో లేనివి మరెక్కడా లేవు. ఇవన్నీ కలగలిపి ఏకరూపంలో ఉండేది. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి, వేదాలను విభజిస్తాడు. మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి, అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను, ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తాడు.
శ్రీమత్భాగవతం భగవానుని 21 అవతారాలని తెలుపుతూ,వేదవ్యాసుని 17 వ అవతారంగా చెబుతుంది. వ్యాసుడు నల్లగా ఉండేవాడంట. అందుకని ఈయనను క్రిష్ణుడు అని అనేవారు. ఈయన నివాస స్థానము హిమాలయములలో, సరస్వతి నది మధ్య గల ఒక ద్వీపం. వేదాలని విభజించి, వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు గనుక వేదవ్యాసుడు అని, పరాశర మహర్షి కుమారుడు గనుక పరాసరాత్మజుడు అని, బదరీక్షేత్రంలో నివసించేవాడు కనుక బాదరాయణుడు అని అంటారు.
సర్వభూతముల యందు దయకలిగియుండుట, సత్యమార్గములో నడుచుట, శాంతగుణాన్ని కలిగియుండుట ఈ మూడు గుణాలని అందరూ అలవరచుకోవాలి అని వ్యాసులవారు తెలియచేసారు. మనందరికీ దేవరుణము, ఋషిరుణము, పితృఋణము అని మూడు ఋణాలు ఉంటాయి. వీటితోపాటు మనుష్య ఋణము కూడా ఉంటుందని వేదవ్యాసుడు తెలియచేప్పాడు. సర్వప్రాణుల యందు దయతో ఉండటం, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య ఋణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు.
మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా,బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి, అతని ఎదుట ప్రత్యక్షమయ్యి వ్యాసా నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు… అని తెలిపి అదృశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా… గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మహాభారతానికి నువ్వు లేకఖుడివి కావాలి అని తెలిపాడు. గణేశుడు అనుమతించాడు. వేదవ్యాసుడు చెబుతూ ఉంటే గణాధీశుడు రచన సాగించాడు.
అందుకే గురుశిష్య సాంప్రదాయం ఏనాటిదో అయినా వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు. వేదాలను నాల్గింటిని తన నలుగురి శిష్యులకు బోధించి, భాగవతాన్ని శుకునకు బోధించాడు. శిష్యులను పరంపరగా బోధించమని కోరాడు. మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి, లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించటం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన ఆషాఢశుద్ధ పౌర్ణమి (గురు పౌర్ణమి) నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి పూజించాలి. ఆ గురువకు పాదపూజ చేసి. కానుకలు సమర్పించి, అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం.