కరోనా కోరల నుండి బయటపడాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి. మాస్కులు పెట్టుకుంటున్నాం, శానిటైజర్ వాడుతున్నాం, ఇక కరోనా రాదూ అనే భ్రమలో వ్యాక్సిన్ వేసుకోవడం మానకూడదని నిపుణులు మరీ మరి చెబుతున్నారు. అంటే వ్యాక్సిన్ పాత్ర ఏంటో అర్థం అవుతుంది. ముందు ఒక్క డోస్ వేసుకుంటే చాలు బతికిపోతాం అనుకున్నాం, కానీ ఆ తరువాత రెండు డోసులు పెడితేనే దాని ప్రభావం ఉంటుందని ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
దేశమంతా వ్యాక్సినేషన్ పూర్తవ్వాలని యుద్ధ ప్రతిపాదికన వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే మొదటి డోసే అందక చాలా మంది ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో పరిశోధకులు కరోనా కంట్రోల్ అవ్వాలంటే మూడో డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే అంటున్నారు. అప్పుడు మాత్రమే కరోనా ఆగుతుంది అంటున్నారు.
ప్రస్తుతం డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాల్ని కుదిపేస్తోంది. ఇండియా సహా 150కి పైగా దేశాల్లో ఇది విస్తరించి ఉంది. అన్ని దేశాల్లోనూ తీవ్రంగానే ఉంది. దీన్ని వ్యాక్సిన్లు కొద్దిగా ఆపగలుగుతున్నా… పూర్తిగా ఆపలేకపోతున్నాయి. పైగా 2 డోసులు వేసుకున్న వారికి సైతం యాంటీబాడీలు కొంతకాలం తర్వాత తగ్గిపోతున్నాయట. అందుకే మూడో డోస్ పడాలి అంటున్నారు.
ప్రస్తుత అంచనాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 2 డోసులు వేసుకున్న వారికి కూడా కరోనా సోకుతోంది. మరణాల్లో కూడా 2 డోసులు వేసుకున్న వారు ఉంటున్నారు. కాబట్టి మూడో డోస్ తప్పదు అంటున్నారు. ఈ వాదనకు మరో కారణం కూడా ఉంది. 2 డోసులు వేసుకున్న తర్వాత కరోనా వైరస్ తనలో జన్యుమార్పులు చేసుకునే ఛాన్స్ ఉందనీ వ్యాక్సిన్ను తట్టుకునేలా కొత్త వేరియంట్లుగా మారే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
అలాంటి వైరస్ను ఎదుర్కోవాలంటే బాడీలో ఎక్కువ యాంటీబాడీలు ఉండాలని అంటున్నారు. అందుకోసం మూడో డోస్ వేసుకోవాలి అని సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ల కట్టడికి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా కూడా అన్నారు. కాలం గడిచే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి బూస్టర్ డోసులు అవసరమన్నారు.
2021 పూర్తయ్యే నాటికి బూస్టర్ డోసులు భారతదేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బూస్టర్ డోసులు పంపిణీ చేయాలంటే మొదటగా దేశ ప్రజలందరికీ టీకాలు వేయాలి. ఆ తర్వాతే బూస్టర్ డోసుల పంపిణీ మొదలవుతుంది. రెండు డోసుల వ్యాక్సిన్ కంటే మూడు డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి మరింత ఉత్తేజితం అవుతుందని అమెరికా వ్యాక్సిన్ కంపెనీలు చెబుతున్నాయి.
అమెరికాకు చెందిన డ్రగ్ కంపెనీలు ఫైజర్, బయోఎన్టెక్, మోడెర్నాలు ఇప్పటికే కోవిడ్ మూడో డోసును కొందరికి ఇస్తున్నాయి. అవయవమార్పిడి చేయించుకున్న వారికి మూడో డోసు కోవిడ్ టీకాలను ఇస్తున్నారు. అయితే రెండో డోసు వేసుకున్న తరువాత 6 నుంచి 8 నెలల లోపు మూడో డోసు తీసుకుంటే పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని ఆయా కంపెనీలు కూడా అభిప్రాయపడ్డాయి.

















