ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాం. అయితే ఆదిదంపతులు అయినా పార్వతీపరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు జన్మించిన రోజే వినాయకచవితి అని చెబుతారు. ఈ పండుగని మన దేశంతో పాటు ఇతర దేశాలలో ఉన్న హిందువులు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక వినాయకచవితి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలోని ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ప్రతి సంవత్సరం తన రూపంతో ఆకట్టుకుంటున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం భక్తులకి ఎలా దర్శనం ఇవ్వబోతున్నాడు? అసలు ఖైరతాబాద్ వినాయకుడు ఏ సంవత్సరం నుండి మొదలైంది? ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకతలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని ఖైరతాబాద్ అనే ప్రాంతంలో ప్రతి సంవత్సరం వినాయకచవితి ని చాలా వైభవంగా జరుపుతారు. అయితే మొట్టమొదటగా 1954 వ సంవత్సరంలో ఖైరతాబాద్ లో ఒక్క అడుగు వినాయకుడి విగ్రహం తో వినాయక చవితి వేడుకలు అనే జరిపారు. ఈవిధంగా ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి కి ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ వచ్చారు. అయితే ఒక్క అడుగుతో ప్రారంభించిన ఖైరతాబాద్ వినాయకుడు ఆలా ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు. ఇలా 60 సంవత్సరాల పాటు 60 అడుగులు పెరిగిన తరువాత మళ్ళి ఒక్కో అడుగు తగ్గిస్తూ మళ్ళీ తరువాతి 60 సంవత్సరాలకి ఒక్క అడుగు వినాయకుడిని ప్రతిష్టించాలని ఈ ఆలయ కమిటీ నిర్ణయించారట.
ఇది ఇలా ఉంటె గత ఏడాది శ్రీ చండీ కుమార అనంత మహాగణపతిగా దర్శనం ఇచ్చిన వినాయకుడు ఈ సంవత్సరం సప్త ముఖాలతో కాళ సర్ప దోష నివారకుడిగా దర్శనం ఇవ్వబోనున్నాడు. అయితే మే 25 వ తేదీన కర్ర పూజతో అంకురార్పణ జరుగగా 57 అడుగుల ఎత్తు, 27అడుగుల వెడల్పు తో వినాయకుడి విగ్రహం ఉంటుంది అని శిల్పి రాజేంద్రన్ తెలిపారు.
ఇది ఇలా ఉంటె, శ్రీ చండీ కుమార అనంత మహాగణపతిగా శాంత చిత్తంతో ఉన్న ఏడు గణపతి ముఖాలు, 14 చేతులు, అందులో కుడి వైపు ఆంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గధతో కూడి ఆశీర్వదిస్తుండగా, ఎడమ వైపు పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లూ, కడియం, లడ్డూ ఉంటాయి. అయితే 57 అడుగుల గణపతికి మరో మూడు అడుగుల ఎత్తులో ఏడు తలల శేషుడు తన పడగతో నీడ కల్పిస్తాడు. ఇంకా వెనుక వైపు ఆరు ఏనుగులు ఐరావత రూపంలో స్వామి వారిని కొలుస్తున్నట్లు కనిపిస్తాయి. గత ఆనవాయితిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా రెండు వైపులా చిరు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేశుడికి కింద నుంచి కుడి వైపున 14 అడుగుల ఎత్తులో లక్ష్మీ దేవి, ఎడమ వైపున చదువుల తల్లి సరస్వతి అమ్మవార్లు ఆశీనులై ఉంటారు. ఇంకా పాదల వద్ద ఆయన వాహనం ఎలుక స్వామి వారికి భజన చేస్తూ కనిపిస్తుంది.
ఈ విగ్రహంలో ప్రతిదీ కూడా ఏడు వచ్చేలా ఏర్పాటు చేయడం వల్ల ఉత్సవాలు చేసే వారికి, మొక్కే భక్తులకు మేలు జరుగుతుందని సిద్ధాంతి గౌరీభట్ల విఠల్శర్మ సూచనల మేరకు ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందంటూ విగ్రహం ప్రత్యేకతను వెల్లడించారు. ఇది ఇలా ఉంటె ఈ సంవత్సరం సెప్టెంబర్ 13 వ తేదీన వినాయకచవితి పండుగ రానుంది. ప్రతి సంవత్సరం ఎన్నో ప్రత్యేకతలతో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ భారీ వినాయకుడిని దర్శించుకోవడానికి అనేక దూర ప్రాంతాల నుండి అనునిత్యం భక్తులు భారీగా తరలి వస్తుంటారు