పరమశివుడు కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం ఒకటి. అయితే శ్రీశైలం పర్వతారోహణం ఈ ఆలయం నుండే ప్రారంభమవుతుంది. శ్రీశైల క్షేత్రానికి ఉత్తరద్వారంగా పిలువబడుతుంది కనుకే దీనిని శివపురం అని పిలుస్తుంటారు. మరి శ్రీశైలానికి ఉత్తరద్వారం అని పిలువబడే ఈ ఆలయంలోని విశేషాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేట మండలానికి 8 కి.మీ. దూరంలో రంగాపూర్ అనే గ్రామం సమీపంలో ఎడమవైపున కనిపించే ఉమామహేశ్వర ముఖద్వారం నుండి 4 కి.మీ. దూరంలో ఎత్తైన కొండపైన ఉమామహేశ్వర క్షేత్రం ఉంది. శ్రీశైలం వెళ్లే వారు విధిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు.
అయితే కాకతీయ సామ్రాజ్య పతనం తరువాత రేచర్ల వంశానికి చెందిన సింగభూపతి కుమారుడు, మాధవనాయకుడు రాచకొండ రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉమామహేశ్వరస్వామికి ఆలయాన్ని దిగువ ఉమామహేశ్వరం నుండి పైకి మెట్లు వేయించినట్లు క్రీ.శ. 1377 నాటి ఒక శాసనం తెలియచేస్తుంది.
ఈ ఆలయ విషయానికి వస్తే, ఒక కొండచరియకు మధ్యభాగంలో స్వయంభువుగా వెలసి ఉన్న ఈ స్వామికి సహజంగానే కొండచరియభాగం ఆలయ పైకప్పుగా ఇరువైపులా గోడలు ఏర్పరచి ముందుభాగంలో ద్వారాన్ని ఉంచి ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంలోని ఉమామహేశ్వరస్వామి సుమారు ఒక అడుగు ఎత్తు కలిగి వర్తులాకారంలో కాక దీర్ఘ చతురస్రాకారంగా స్వామి భక్తులకి కనిపిస్తారు. స్వామివారు పానవట్టంపై నుండి తొంగబడినట్లు ఉంటుంది. ఇక స్వామివారికి కుడివైపున ఉమాదేవి ఆలయాన్ని, ఎడమవైపున మహిషాసుర మర్ధిని ఆలయాన్ని ఏర్పరిచారు.
ఇంకా ఈ మందిరంలో ఒకచోట భూగర్భ జలధార అనేది కనిపిస్తుంది. సంవత్సరంలో ఏ సమయంలో అయినా ఆ ఊట గుంత నుండి ఎంత తీసిన ఒక చెంబు నీళ్లు వెంటనే ఊరుతుంటాయి. ఈ ఆలయంలో చతుర్భుజ దుర్గాదేవి, చతుర్భుజ గణపతి మొదలగు దేవతామూర్తులు కొలువై ఉన్నారు.
ఇలా వెలసిన ఈ స్వామికి ప్రతి సంవత్సరం జనవరిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇంకా మకర సంక్రాంతి సందర్బముగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను స్థానికులు జాతరగా వ్యవహరిస్తుంటారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.