ఈ కోటిపల్లి పుణ్యక్షేత్రంలో సోమేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. చంద్రుడు ఇక్కడి ఆలయంలో స్వామివారిని ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లా. పామర్రు మండలానికి చెందిన కోటిపల్లి గ్రామంలో సి సోమేశ్వరస్వామి ఆలయం ఉంది. పవిత్ర గోదావరి నది తీరాన ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ సోమేశ్వరాలయం. ఈ ఆలయంలో రాజరాజేశ్వరీ సహిత శ్రీ సోమేశ్వరస్వామి వారు, అమ్మవారితో కూడిన కోటేశ్వరస్వామి వారు, శ్రీదేవి, భూదేవి సహిత జనార్దన స్వామివారు ప్రతిష్టితులై ఉన్నారు.అయితే ఇంద్రుడు తన పాపాలను తొలగించ్చుకోవడానికై ఇక్కడ కోటేశ్వర లింగాన్ని , అమ్మవారి విగ్రహాన్ని, చంద్రుడు తన పాపాల నివారణకై సోమేశ్వర లింగాన్ని రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు గౌతమ మహత్యం వెల్లడిస్తున్నది. ఆలయం సమీపంలోని నది నీటిని గౌతమ మహర్షి తీసుకొనివచ్చినట్లు ఐతిహ్యం. దీనితో ఈ నీటికి పవిత్రత ఆపాదించబడింది. కోటిపల్లిలోని గౌతమి నదిలో స్నానం చేసినవారికి పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ ఆలయంలోని గర్భగుడిలో చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఉంది. ఇది నేల బారుగా భూమికి నాలుగు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఆలయానికి ఎడమఒక్క వెనుక ఉన్న చిన్న గదిలాంటి చోట ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఉంది. చంద్రుడు ప్రతిష్టించిన దానిని సోమేశ్వరుడు, ఇంద్రుడు ప్రతిష్టించిన దానిని కోటీశ్వరుడు అని అంటారు. ఇక్కడ విచిత్రంగా గర్బగుడి రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగంలో సోమేశ్వరుడు, మరొక భాగంలో విష్ణుమూర్తి విగ్రహం ఉంది. రెండినీటికి కలిపి పైన శిఖరం మాత్రము ఒకటిగానే నిర్మించారు. కోటిపల్లిలో శివకేశవులకు భేదం లేదు. ఇక్కడ కోటేశ్వర లింగం యోగలింగంగా, సోమేశ్వర లింగం భోగలింగంగా పిలువబడుతున్నాయి. ఆలయ అర్చకులు ఉదయం పెందరాళే పవిత్ర నదీజలాలను తెచ్చి వాటితో దేవతామూర్తులకు అభిషేకం చేస్తారు. సాయింత్రం ధూప సేవ, ఆస్థాన పూజ, పవళింపు సేవ జరుపుతారు. ఇక్కడి జనార్ధన స్వామిని సిద్ధి జనార్ధన స్వామిగా పూజిస్తారు. ఈ దైవం భక్తుల కోరికలను ఇట్టే తీరుస్తాడని ప్రతీతి.ఒకానొకప్పుడు కోటిపల్లిని సోమప్రభపురంగా పిలిచేవారు. ఆలయం ఎదుట ఉన్న పెద్ద కొలనును సోమ పుష్కరిణిగా పేర్కొంటున్నారు. ఆలయంలో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి. ఉత్తర దిశలోని మండపంలో కాలభైరవస్వామి ఆలయం , శంకరాచార్య మందిరం, చంద్రమౌళీశ్వరస్వామి లింగం ఉన్నాయి.ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఈ దేవాలయ ప్రాంగణంలో కోటి దీపాలు వెలిగిస్తారు. కోటి గోవులు, కోటి కన్యాదాన ఫలాలు, నూరు అశ్వమేథయాగ ఫలాలు, మూడు కోట్ల శివలింగ ప్రతిష్ట వలన వచ్చే ఫలం ఇచట గల తీర్థంలో స్నానం చేస్తే లభిస్తుందని చెబుతుంటారు.