పురాణాల ప్రకారం నరసింహస్వామి తేత్రాయుగంలో ఐదు రూపాల్లో సాక్షాత్కారించాడు. అవి జ్వాలా నరసింహుడు, యోగ నారసింహుడు, గండ బేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మి నారసింహ రూపాల్లో యాదమహర్షికి దర్శనం ఇచ్చాడు. అయితే ఎక్కువగా నరసింహస్వామి ఆలయాలు కొండప్రాంతంలోనే ఉంటాయి. అలానే ఇక్కడ కూడా లక్ష్మీనరసింహస్వామి ఒక కొండగుహలో వెలిశాడని పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, మానిక్ బందర్ గ్రామంలో అఘోర లక్ష్మి నరసింహస్వామి గుహాలయం ఉంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి అఘోర లక్ష్మీనరసింహస్వామిగా పూజలను అందుకుంటున్నాడు. ఈ ఆలయం ఒక గుట్టపైన ఉన్నదీ. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఆలయ సమీపంలో రాతితో నిర్మించబడిన ఒక పుష్కారిని ఉంది. ఇంకా గర్భాలయం ఒక పెద్ద రాతి గుండు క్రింద గల ఒక గుహ ఉండగా, ఆ గుహలో ఒకటిన్నర అడుగుల ఎత్తు గల స్వామివారి విగ్రహం పద్మం పై నిల్చుండి, చతుర్భుజుడిగా, శంఖు, చక్ర, గదా ధారియై, పొడవైన గడ్డం కలిగి ఉన్నాడు. ఇక్కడ పాదాల వెనుక సరస్వతి దేవి వాహనమైన హంస ఉండుట మరొక ప్రత్యేకత గా చెబుతారు.
ఇక ఈ ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే జండా బాలాజీ అనే ఆలయం ఉంది. ఇక 1930 లో నర్సాగౌడ్ అనే భక్తుడు బాలాజీ మందిరము దర్శించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. అయితే ఆ భక్తుడు ఒక జెండాని పట్టుకొని ఆలయ ప్రాంగణంలో బాలాజీ విశిష్టతలను ప్రతి రోజు ప్రబోధించేవాడు. ఇలా ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ఆ జెండాని మొక్కడంతో కాలక్రమేణా ఆ జండానే స్వామిగా భక్తులు పూజిస్తున్నారు. ఈవిధంగా అప్పటినుండి భక్తులు స్వామివారికి కాకుండా నేరుగా జండాని మొక్కడం ప్రారంభించారు. ఇలా మొక్కడంతో కోరిన కోరికలు సిద్ధిస్తున్నాయని ప్రతి సంవత్సరం ఇక్కడ జండా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక స్వామివారు స్వయంభువుగా వెలసినప్పటికీ జండానే మొక్కడం ఆరంబించడంతో జండా బాలాజీ అనే పేరు వచ్చిందని చెబుతారు.