ఎన్నో పురాతన ఆలయాలకు ఆలవాలం మన భారత దేశం. అలాగే భారతీయ సంస్కృతిలో ఎందరో దేవతలు, దేవుళ్లకు సంబంధించిన కథల గురించి వినే ఉంటాం. కొన్ని ఆలయాలు… స్వయంగా దేవుళ్లే నిర్మిస్తే.. మరికొందరు భక్తులు.. మహర్షులు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. ఇక ఇప్పటికీ అటువంటి ఆలయాలను సందర్శిస్తూనే ఉంటాం. కొన్ని ఆలయాలు ఇప్పటికీ చేధించలేని రహాస్యాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి ఆలయం గురించి తెలుసుకుందాం…
ఆలయంలో దీపాన్ని వెలిగించాలంటే నూనె లేదా నెయ్యి అవసరం. కానీ ఈ గుడిలో నీటితో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. మధ్యప్రదేశ్లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిరంలో ఈ అద్భుతాన్ని చూడవచ్చు.
ఈ దీపం గత ఐదేళ్ల నుంచి నూనె, నెయ్యి అవసరం లేకుండానే నీటితో వెలుగుతోంది. దీంతో ఈ వింత చూసేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఈ దీపం ఆరకుండా వెలుగుతూనే ఉందని, దేశంలో చాలా మందిరాల్లో ఇలా ఆరకుండా వెలిగే జ్యోతులు ఉన్నా.. ఇది మాత్రం చాలా భిన్నమైనదని ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు.
ప్రమిదలో నిత్యం నూనెకు బదులు నీటిని పోస్తే చాలు.. అలా వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆలయం పూజారి సిందూ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇదివరకు ఈ జ్యోతి నూనెతోనే వెలిగేది. అయితే, ఓ రోజు అమ్మవారు కలలోకి వచ్చి.. ఈ దీపాన్ని నీటితో వెలిగించాలని చెప్పారు. ఆమె ఆదేశాల ప్రకారం నీటితో దీపాన్ని వెలిగించాం. అప్పటి నుంచి ఈ దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది’’ అని తెలిపారు.
అయితే, అది కలా, నిజమా తెలియక ఆశ్చర్యపోయానని, సుమారు రెండు నెలలపాటు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. ఈ ఆలయం నదీ తీరంలో ఉండటం వల్ల వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది. దీంతో వర్షాకాలమంతా ఆలయం మూసే ఉంటుంది. మళ్లీ నవరాత్రులకే ఈ ఆలయాన్ని తెరుస్తారు. వచ్చే వర్షాకాలం వరకు దీపం వెలుగుతూనే ఉంది