అతడి రూపం నల్లటిది. కాని మనసు మాత్రం మరుమల్లె కన్న తెల్లనిది, పరిమళభరితమైనది, స్వచ్ఛమైనది. బాల్యం నుంచి – ఆ మాటకొస్తే పుట్టకముందు నుంచే ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? ఎన్ని సవాళ్లను అధిగమించాడు? కన్నతల్లిదండ్రులకు దూరమయ్యాడు. స్వంత మేనమామే శత్రువై సంహరింప చూసినా చలించని, దేనికీ భయపడని, ఎవరికీ లొంగని ఆ ధీరోదాత్తుడే శ్రీకృష్ణుడు. కార్యసాధన అంటే ఏమిటో ఆచరించి చూపిన సిసలైన కార్యసాధకుడు, శరణన్న వారికి రక్షణగా నిలిచిన అసలైన రక్షకుడు, మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీసివేయాలని, తగిన ఉపాయముంటే ఎంతటి అపాయం నుంచయినా బయట పడవచ్చునని రుజువు చేసి చూపిన అసహాయ శూరుడు శ్రీకృష్ణుడు.
కన్నయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే… ఆయన్ని ఆరాధించని వారు ఎవరుంటారు? ఈ నేపథ్యంలో శ్రీ కృష్ణుని ఆలయం అంటే నీలిరంగు మోము కలిగి, చేతిలో పిల్లనగ్రోవి తలపై నెమలి పించం ఎంతో చూడముచ్చట ఆకారంలో ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంటాడు.
కానీ ఒక ఆలయంలో మాత్రం మొహం పై గాయాలతో ఉన్నటువంటి శ్రీ కృష్ణుడు మనకు దర్శనం కల్పిస్తాడు.
మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? శ్రీకృష్ణుడు ఈ విధంగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి? ఈ ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
శ్రీ మహా విష్ణువు యొక్క ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఈ ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది అని చెప్పవచ్చు. శ్రీ మహావిష్ణువు పార్థసారథిగా దర్శనమిచ్చే ఈ ఆలయం తమిళనాడు లోని చెన్నై సముద్ర తీరాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రిప్లికేన్ లో ఉంది.
ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో కొలువై ఉన్న పార్థసారధి విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్టించాడని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఆలయ స్థల పురాణం ప్రకారం సుమతి అనేమహారాజు కు ఇచ్చిన మాట ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారని చెబుతారు.
ఈ క్రమంలోనే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు వదిలిన బాణాలు శ్రీకృష్ణుడికి కూడా తగలడంతో శ్రీకృష్ణుడి మొహంపై గాయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే మూలవిరాట్ పై ఇప్పటికి మచ్చలు ఏర్పడి ఉన్నాయి.
ఈ క్రమంలోనే కురుక్షేత్ర సంగ్రామంలో ఎటువంటి ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం అనేది ఉండదు. కేవలం స్వామి వారి చేతిలో శంఖం మాత్రమే ఉంటుంది.
ఈ ఆలయంలో వేరుశెనగ నూనె, మిరపకాయలు నిషిద్ధం.ఈ ఆలయంలో కొలువై ఉన్న పార్థసారథి విగ్రహానికి, వెంకటేశ్వరుని విగ్రహానికి వేరువేరుగా ధ్వజస్తంభాలు ఉన్నాయి.