త్రిమూర్తులలో ఒకరు శ్రీమహావిష్ణువు. లోక కళ్యాణం కోసం అయన దశ అవతారాలు ఎత్తాడనీ పురాణాలూ చెబుతున్నాయి. ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత అనేది ఉంది. అందులో శ్రీమహావిష్ణువు ఎత్తిన మొదటి అవతారం మత్స్యావతారం. మరి ఆ స్వామి మొదటగా మత్స్యావతారం లో వెలసిన ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ రాష్ట్రంలోని, ఆరావళి పర్వతాల దిగువన ఉదయ్పూర్వతి అనే గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో లోహర్గల్ ఉంది. ఇక్కడే శ్రీమహా విష్ణువు తన మొదటి అవతారాన్ని ఎత్తాడని ప్రచారంలో ఉంది. పురాణాలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి. శంఖాసురుడనే రాక్షసున్ని సంహరించడం కోసం శ్రీమహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని ఇక్కడే ఎత్తాడని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రదేశం బ్రహ్మ క్షేత్రంగా పేరుగాంచిందని వారు అంటున్నారు.
మహాభారత యుద్ధం అనంతరం ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు లోహర్గల్కు వచ్చి అక్కడి కొలనులో స్నానం చేసినప్పుడు వారి వద్ద ఉన్న ఆయుధాలన్నీ నీటిలో కరిగిపోయాయంట, రక్తంలో తడిసిన వారి దేహాలు మోక్షం పొంది కైలాసానికి వెళ్లాయని కూడా చెబుతున్నారు. లోహర్గల్ అంటే లోహ (ఇనుము), గల్ (కరగడం) అనే అర్థాలు వస్తాయి. అంటే లోహాలు కరిగిపోతాయన్నమాట. అందుకే ఆ కొలనుకు, అక్కడి ప్రదేశానికి ఆ పేరు వచ్చింది.
ఇంకా పరశురాముడు తన ఆగ్రహం కారణంగా అనేక మంది మృతికి కారణం అవడంతో తన పాపాలను కడిగేసుకునేందుకు లోహర్గల్ కొలనులో స్నానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రదేశం ఇప్పుడు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఇంతటి పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించేందుకు ఏటా అనేక మంది భక్తులు ఇక్కడి వస్తుంటారు కూడా. ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి అమావాస్య వరకు అక్కడ పెద్ద జాతర కూడా జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. పుణ్య స్నానాలు ఆచరిస్తారు.