దేవాలయం అంటే దేవుని నివాసం . గుడిలోని దేవుణ్ణి దర్శించటానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు.. అంతస్థుల భేదం, లింగ భేదం లేకుండా దేవుణ్ణి మొక్కుతారు. ప్రసాదాలు తీసుకెళ్తారు. తీరా ఆ కోరిక సఫలమైన తర్వాత మొక్కు తీర్చుకోవటానికి వస్తుంటారు.. అయితే కొన్ని ఆలయాల్లో ఆడవారికి ప్రవేశం లేదు. అలాంటి ఆలయాల గురించి మనకు తెలుసు. ఇటీవలే సుప్రీంకోర్టు జోక్యంతో కొన్ని ఆలయాల్లో స్త్రీలకు ప్రవేశం కల్పించారు.
కానీ ఇక్కడే ఒక గమ్మత్తైన విషయం ఉంది. మీకు తెలుసా? కొన్ని ఆలయాల్లో మగవారికి ప్రవేశం నిషిద్ధమని! అదేంటి… మగవారు ప్రవేశించలేని ఆలయాలున్నాయా మనదేశంలో అని ఆశ్చర్యపోతున్నారా?
వినడానికి కొత్తగా వింతగా ఉన్నా ఇదినిజం…అది కూడా ఈ ఆలయాలు ఉన్నది ఎక్కడో కాదు. మన భారతదేశంలోనే…కాదు కూడదు మేం లోపలికి వెళ్తాం అని ఎవరైనా మగవారు ప్రయత్నిస్తే వారు వెళ్లడానికి వీల్లేకుండా అడ్డుకునేందుకు సెక్యురిటీ గార్డ్సు కూడా ఉంటారు…ఇంతకీ ఆ ఆలయాలు ఏంటి. అవెక్కడున్నాయి తెలుసుకోండి.
బ్రహ్మదేవుని ఆలయం :
బ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది. బ్రహ్మ దేవునికి ఆలయాలు చాలా అరుదు. అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది.
ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం, యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు. బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది. ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు.
సంతోషిమాత ఆలయం :
సంతోషి మాత ఆలయం మహిళలకు లేదా పెళ్లికాని అమ్మాయిలకు ప్రసిద్ద ఆలయం, సంతోషి మాత వ్రతం ఆచరించే వారు పుల్లని పండ్లు లేదా ఊరగాయాలు తినడకూడదు. శుక్రవారం పూట సంతోషిమాతను ఎక్కువగా కొలుస్తారు స్త్రీలు. ఆ రోజు ఇంట్లో వంటలలో ఉల్లిని వాడడం కూడా జరగదు. సాధారణంగా సంతోషి మాత ఆలయంలోనికి పురుషులకు అనుమతి ఉండదు. ఒకవేళ కొన్ని చోట్ల అనుమతి ఉన్నా, వారు చాలా నియమనిష్టలతో నియమాలను ఆచరించాల్సి ఉంటుంది.
అట్టుకల్ దేవాలయం :
పార్వతి దేవి కొలువై ఉన్న అట్టుకల్ దేవాలయం కేరళ లోని తిరువనంతపురంకి సమీపంలో ఉంది. ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు.ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులకు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి. మగవాళ్లు ఉండరాదు. ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం. మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన.
చక్కులాతుకవు దేవాలయం :
కేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం ఉంది. ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది. ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు. ఇక్కడ పూజలలో,ఉత్సవాల్లో మహిళలే పాల్గొంటారు.
భాగతీమాత ఆలయం :
దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి. దేవీ ఆలయం కన్యాకుమారిలో ఉంది. ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత. అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు. ఈ ఆలయంలోకి కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.
మాతా ఆలయం :
మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో ఉంది. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు. మగవారికి ప్రవేశం లేదు.