అమ్మవారి ఎన్నో మహిమ గల ఆలయాల్లో ఏడు కొండల సమూహంలో వెలసిన ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడి అమ్మవారు యుద్దానికి సిద్ధంగా ఉన్నట్లుగా 18 హస్తాలతో 18 రకాల ఆయుధాలు ధరించి దర్శనం ఇస్తారు. మరి ఈ మహిమ గల ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర, నాసిక్ జిల్లా కి కొన్ని కిలోమీటర్ల దూరంలో సప్తశృంగి పర్వతం పైన సప్తశృంగి మాత ఆలయం ఉంది. ఇక్కడ కాళికాదేవి కొలువై ఉంది. సప్త అంటే ఏడు, శృంగి అంటే కొమ్ము అని అర్ధం. పూర్వం ఈ కొండ ఏడు నిటారు కొమ్మలాగా ఉన్న కొండల సమూహంగా ఉండేది. అందుకే ఈ పర్వతానికి సప్తశృంగి అనే పేరు వచ్చినది.
తేత్రాయుగంలో ఈ అమ్మవారిని శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు పూజించినట్లుగా చెబుతారు. ఇక అక్కడి స్థానికుల కథనం ప్రకారం, పూర్వం ఈ అమ్మవారి ఆలయానికి రాత్రివేళలో ఒక పులి కాపలా ఉండేది. అయితే అతిపురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో మార్కండేయమహర్షి దేవి మహత్యాన్ని రచించాడని పురాణం.
ఆలయ విషయానికి వస్తే, కొండపైన వెలసిన ఈ అమ్మవారు 18 హస్తాలతో, 18 రకాల ఆయుధాలు ధరించి శత్రువులతో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా శిల్పాన్ని మలిచారు. అయితే శృంగి దేవి మహిషాసురుడిని సంహరించేందుకు వెళుతున్నప్పుడు దేవతలందరు ఇచ్చిన ఆ ఆయుధాలే ఇక్కడ చేతిలో పట్టుకొని దర్శనం ఇస్తుందని చెబుతారు.
ఇలా ఎంతో మహిమగల ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి చైత్ర పౌర్ణమి నాడు ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ సమయంలో దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కొండ పైన ఉన్న అమ్మవారిని దర్శించి తరిస్తారు.