కరోనా మూడో వేవ్ నుండి తట్టుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు తేల్చి చెప్పారు. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారం అని కూడా స్పష్టం చేశారు. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. పెద్దఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. ప్రజలందరికి రెండు డోసుల వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. మొదటి డోసు తీసుకున్న కొన్ని వారాల తర్వాత రెండో డోసు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మొదటి డోసు ఓ సంస్థకు చెందిన వ్యాక్సిన్ వేసి రెండో డోసు మరో వ్యాక్సిన్ వేసినా మంచి ఫలితం ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పలు దేశాల అధినేతలు కూడా రెండు వేర్వేరు టీకాలు వేయించుకున్నారు. ఈ తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా వ్యాక్సిన్లను వాడితే ప్రమాదకరమని హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ల కాంబినేషన్పై ఇప్పటివరకు సరైన డేటా అందుబాటులో లేదని చెప్పారు. అంతేగాక, ప్రజలే సొంతంగా ఏ వ్యాక్సిన్ తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో నిర్ణయించు కోవడం ఆందోళనకరమైన విషయమని తెలిపారు.
ప్రస్తుతం మనదేశంలో కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లను వేర్వేరు పద్ధతుల్లో అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ప్లాట్ఫాంలపై ఆధారపడి ఉన్నాయి. కోవాగ్జిన్ ఒక ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్. కొవిషీల్డ్ వైరల్ వెక్టార్ ప్లాట్ఫాంపై ఆధారపడి ఉంది. అందువల్ల రెండు టీకాలను కలిపి తీసుకోవద్దు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలి.
కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న రెండు వారాల తర్వాతే రక్షణ లభిస్తుందని క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైంది. టీకా వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు దాదాపు తగ్గుతాయి. ప్రాణాపాయం ఉండదు.వ్యాక్సినేషన్ తర్వాత కూడా వైరస్ సోకితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. మీ నుంచి ఇతరులకు వైరస్ సోకే ముప్పు తగ్గుతుంది. తొలి డోసు తర్వత కూడా కొన్ని ప్రయోజనాలుంటాయి. కానీ రెండు డోసులు తీసుకుంటేనే టీకా పూర్తి సమర్థవంతంగా పని చేస్తుంది.
అయితే కొంతమంది గడువు దాటినా కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవడం లేదు. మరిచిపోవడమో, అలసత్వమో, సంకోచమో… మరో కారణమో కానీ చాలామంది సెకండ్ డోసు తీసుకోవడం లేదు. నిజానికి భారత్లో లభించే కరోనా టీకాల్లో ఒక డోసు తీసుకుంటే 30% మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయి. మిగిలిన 70 శాతం మందికి అది కేవలం బూస్టర్ డోసుగానే ఉపయోగపడిందని నిపుణులు చెబుతున్నారు.
ఒక్క డోసు తీసుకుంటే మళ్లీ కోవిడ్ సోకే అవకాశాలుంటాయని హెచ్చరించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత మన శరీరం కరోనాపై పోరాటానికి ప్రాథమికంగా సిద్ధమవుతుంది. రెండో డోసు తీసుకున్నాక నిరోధకత మరింత బలోపేతమై మెమొరీ-బి కణాలు ఉత్పన్నమవుతాయి. వైరస్ వివరాలను ఈ కణాలు నమోదు చేసుకొని భవిష్యత్తులో ఇదే వైరస్ మన శరీరంపై దాడి చేస్తే, వాటిని గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేసి యుద్ధం ప్రకటిస్తాయి. రెండో డోసు తర్వాతే పూర్తి స్థాయిలో యాంటీబాడీలు చేరి కరోనా నుంచి రక్షణ లభిస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు.
ఇక దేశంలో కరోనా మూడో దశ ఉద్ధృతి చోటుచేసుకోవచ్చన్న అంచనాల నేపథ్యంలో చిన్నారులపై కోవిడ్-19 టీకా ఔషధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిన్నారులపై కొవాగ్జిన్ టీకా ఔషధ పరీక్షల్లో భాగంగా 2-6 ఏళ్ల వయసు వారికి రెండో డోసు టీకా ఇవ్వనున్నారు. కోవిడ్-19కు సంబంధించి భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకాను 2 నుంచి 18 ఏళ్ల వారిపై పరీక్షిస్తున్నారు.