ఈ ఆలయానికి ఒక విశేషం ఏంటంటే ఒకసారి వెంకన్న స్వామిని దర్శించినవారు తప్పకుండ మళ్ళీ పదే పదే వెళ్తారని చెబుతుంటారు. అయితే కలియుగ భగవానుడు అయినా శ్రీ వేంకటేశ్వరస్వామి ఇక్కడ ఎలా వెలిసాడు? ఈ ఆలయానికి గల స్తలపురాణం ఏంటి? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖజిల్లా, విశాఖపట్టణం నుండి 85 కీ.మీ. దూరంలో, తుని రైల్వే స్టేషన్ నుండి 20 కీ.మీ. దూరంలో, 5 వ నెంబర్ జాతీయ రహదారి పై నక్కపల్లి మండలం, నక్కపల్లి గ్రామముకు సుమారు 2 కీ.మీ. దూరంలో ఉపమాపక గ్రామం కలదు. ఈ గ్రామం నందు పురాతన విష్ణు క్షేత్రంగా పిలవబడే శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, ద్వాపరయుగంలో కీకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో మోక్షం కోరి మునులు తపస్సు చేసి విషమూర్తిని ప్రసన్నం చేసుకోగా “మీరు మృగాలై ఇక్కడి అడవిలో సంచరిస్తుండగా కలియుగంలో కల్కి అవతారంగా వచ్చి సంహరించి మీకు మోక్షం కలిగిస్తానని చెప్పాడు. దీని ప్రకారమే సతిసమేతుడై అశ్వారూఢుడై ఉత్తరముఖంగా వెలసినట్లు కథనం.
మరో కథనం ప్రకారం గరుడాద్రి అనే పర్వత రాజు చేసిన తపస్సుకి మెచ్చి స్వామివారు ఇక్కడ వెలిశారు. అయన బరువును మోయలేని పర్వతరాజు కుంగిపోతుండడంతో తిరుపతిలో వెలసి ప్రతిరోజు రాత్రిళ్ళు విశ్రాంతి నిమిత్తం ఈ క్షేత్రానికి వస్తానని, ఈ ప్రదేశం ఉపమాక పేరుతో ప్రసిది చెందుతుందని, ఇక్కడ ఆచరించిన పూజ, తపస్సు, దాన, పుణ్యదిక కర్మలు ఫలప్రదాయం అవుతాయని స్వామివారు ఆనతిచ్చారు. అందుకే కొండమీద ఆలయం పగటిపూట తెరచి ఉంటుంది కానీ రాత్రి పూట ఆలయాన్ని తెరువరు.
ఈ ఉపమాక గ్రామమునందు గరుడాకారం గల ఒక కొండపై శ్రీ వేంకటేశ్వరస్వామి వార్లు స్వయంభూమూర్తిగా వెలిసినాడు. స్వామివారి రూపం లీలగా మాత్రమే మనకు కనబడుతుంది. అశ్వముపై కూర్చున్న ఆరు భుజములు కలిగిన శ్రీనివాసుడు తిరునామ అలంకారుడై, శంఖం, చక్ర, ఖడ్గం, గద, డాలు, అభయహస్తంతో నయనానంద కరముగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. అయితే ఉపమాక అంటే సాటి లేనిది అని అర్థం. ఇటువంటి క్షేత్రం మరెక్కడా ఉండదని అర్థం స్ఫురించేలా పురాణాలలో ఉపమాక అనే పదాన్ని ఉపయోగించారు. కలౌ వేంకటనాయక అన్నట్లుగా, కలియుగంలో శ్రీమన్నారాయణుడు వేంకటేశ్వరస్వామి అవతారంలో వేంచేస్తారని పురాణాలు చెబుతున్నాయి.
గరుడాద్రి పర్వతంపై గుర్రంపై వేటకు వెళ్తున్న రూపంలో స్వామి దర్శనమిస్తాడు. ఆలయానికి ఎదురుగా ఉన్న బందుర సర స్సులో బ్రహ్మ తపస్సు చేశాడట. ఆ సరస్సులోని పవిత్ర జలాలతో అనునిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. బందుర సరస్సులో స్నానమాచరించి ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ బందుర సరస్సు ఎంతో పవిత్రమైనదని తిరుమలలోని పాపనాశంతో సమానమని చెబుతారు.
అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒక్కరోజు లభించే ఉత్తర ద్వారదర్శనం, ఇక్కడ నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా విలసిల్లుతోంది. ∙అయితే దూరం నుంచి ఈ పర్వతం గరుడ పక్షి ఆకారంలో కనిపిస్తుంది. అందుకే ఈ కొండను గరుడాద్రి అంటారు.
ఇలా ఎన్నో విశేషాల నడుమ ఈ ఆలయంలో వెలసిన ఈ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.