ఆరోగ్యానికి పెసర్లు చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కొందరు వీటిని ఉడకబెట్టుకుని గుగిళ్లుగా చేసుకుని తింటారు. కొందరు వాటిని నానబెట్టి, మొలకెత్తిన గింజలను తింటారు. కొంతమంది వీటితో రకరకాల వంటకాలు చేసుకొని తింటారు. ఎలా తిన్నా పెసర్ల వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే ఇప్పటి వరకు పెసర్లు ఆరోగ్యానికే మేలు చేస్తాయని మనకు తెలుసు. కానీ వాటితో పలు చర్మ సమస్యల నుంచి సైతం బయట పడవచ్చట. ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి పెసర్లు చక్కగా ఉపయోగపడతాయట. మరి పెసర్లతో ముఖానికి సంబంధించిన సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రిపూట కొన్ని పచ్చిపాలను తీసుకుని వాటిలో కొన్ని పెసరగింజలను వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి దాన్ని ఫేస్ప్యాక్గా ముఖానికి రాసుకోవాలి. అలా 20 నిమిషాలు ఆగాక నీటితో కడిగేయాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారికి ఈ ప్యాక్ ఎంతగానో మేలు చేస్తుంది.
ఒక గ్లాసు నీటిలో గుప్పెడు పెసర్లు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని పేస్ట్లా చేసుకోవాలి. అందులో పెరుగు లేదా అలోవెరా జెల్ వేసి బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు ఆగాక చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఎండలో కందిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది
రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో కొన్ని పెసర్లను వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలి. అందులో 1/2 టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి దాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే మొటిమల సమస్య నుంచి బయట పడవచ్చు.