రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే వడగాలుల ప్రభావం ఉంటుంది ఎండలతో పిల్లలు, వృద్ధులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ను దాటితే మన శరీరాలు తట్టుకోవడం కష్టం. 37 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలకు ఎక్స్పోజ్ అయ్యేవారు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వడగాలి ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అందుకే పనుల మీద బయటకు వెళ్లేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయమిది. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ, శ్వాసకోశ, గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. బీపీ, షుగర్ టాబ్లెట్స్ కారణంగా శరీరంలోని కొన్ని లవణాలు చమట రూపంలో బయటకు వెళ్తాయని, అందువల్ల వీరు త్వరగా వడదెబ్బ బారి పడే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
నిప్పులు చెరిగే ఎండలోకి వెళ్తేనే వడదెబ్బ తగులుతుందని భావించడానికి వీల్లేదు. ఒక్కొక్కసారి నీడపట్టున ఉన్నవారిని కూడా ఈ సమస్య బాధించే వీలుంది. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో మండుటెండల్లో తిరిగేవారైనా, ఇంటి వద్ద ఉంటున్నవారైనా సన్స్ట్రోక్ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
వడదెబ్బ బారి నుంచి తప్పించుకోవడానికి పాటించాల్సిన మొదటి సూత్రం నీళ్లు ఎక్కువగా తాగడం. నోరు ఆరిపోకుండా తరచూ నీళ్లు తాగుతుండాలి.
సాధారణంగా ఎండలోకి వెళ్లిన్నప్పుడు చల్లటి కూల్డ్రింక్లు, ఐస్ నీళ్లో తాగాలనిపించడం సహజం. కానీ ఎండాకాలంలో అదీ మండుటెండల్లో తిరుగుతూ కూల్డ్రింక్స్ తాగడం మహా డేంజర్. కూల్డ్రింక్స్, ఐస్వాటర్ లాంటివి ఎక్కువగా తాగేవారు సన్స్ట్రోక్కు ఈజీగా లోనవుతారనే విషయాన్ని మరువకూడదు. వీటిబదులు పండ్లరసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగకు ప్రియార్టీ ఇవ్వడం మంచిది. ఎక్కువగా లస్సీ, నిమ్మరసం, అంబలి తీసుకోవాలి.
అలాగే మండుటెండలో బయటకు వెళ్లొచ్చి గటగటా చల్లటి నీళ్లు తాగడం కంటే సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీళ్లనే తాగడం ఉత్తమం. అసలు బయటకు వెళ్లేముందే నీళ్లు తాగి బయలుదేరడం మరింత తెలివైన పని.
ఎండలోకి వెళ్లటప్పుడు నెత్తిన తలపాగా, టోపీ, గొడుగు, అవేవీ లేకపోతే కనీసం కర్చిఫ్ అయినా నెత్తిన వేసుకోవడం మంచింది. బయటికి వెళ్ళేటప్పుడు తేలికైన, లేత రంగు కాటన్ దుస్తులను ధరించాలి.
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తలకు హెల్మెట్ తెల్లని గుడ్డను కట్టుకోవాలి. ఎక్కువ దూరం వెళ్లే వారు మధ్య మధ్యలో నీడ పాటు ఆగి నీళ్లు తాగాలి. వేసవి కాలంలో పాటించాల్సిన మరో ముఖ్య విషయం ఎక్కువ సేపు నిల్వ చేసిన ఆహార పదార్థాలు తిన కూడదు. ఎండాకాలంలో నిల్వ చేసిన ఆహారంలో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడిగా, తాజాగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయల ముక్కలు అప్పటికప్పుడు కోసుకొని తినాలి తప్ప ఫ్రిజులో దాచీదాచీ తినొద్దనేది వైద్యుల మరో సూచన.