ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే ఇక జీవితాంతం షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే. దాన్ని పూర్తిగా నయం చేసుకోడానికి చికిత్స లేదు. బతికున్నంతకాలం టాబ్లెట్స్ వేసుకుంటూ షుగర్ ను కంట్రోల్ చేసుకోవాల్సిందే. లేదంటే షుగర్ పెరిగిపోయి లేనిపోని సమస్యలు వస్తాయి. ఇక సీజన్ మారుతున్నా కొద్దీ వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇతరులకన్నా కొంచెం బలహీనమైన రోగనిరోధక శక్తి ఉండవచ్చు. అందువల్ల, మధుమేహ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాకాలంలో మధుమేహం ఉన్నవాళ్లకు జర్వం ఎక్కువగా వస్తుంది. జ్వరంతో పాటు.. రకరకాల వైరస్ లు త్వరగా అటాక్ అవుతాయి. దాని వల్ల.. దగ్గు, జలుబు.. ఇంకా చాలా రకాల సమస్యలు వస్తాయి. మామూలుగా.. వర్షాకాలంలో ఇటువంటి వైరస్ లు అందరినీ అటాక్ చేసినా.. డయాబెటిస్ ఉన్నవాళ్లను ఇంకాస్త ఎక్కువగా అటాక్ చేస్తాయి. అందుకే.. షుగర్ ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
సాధారణంగానే షుగర్ ఉన్నవాళ్లకు ఎక్కువగా మూత్రం వస్తుంటుంది. దాని వల్ల వాళ్లు ఎక్కువగా నీళ్లు తాగరు. కానీ.. అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే.. నీళ్లు తక్కువగా తాగితే.. డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. వర్షాకాలం అయినా సరే.. వర్షాలు ఎక్కువగా పడినా సరే.. నీళ్లు మాత్రం ఖచ్చితంగా తాగాల్సిందే. ముఖ్యంగా వానాకాలంలోనే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా చెమట ద్వారా నీరంతా బయటకు పోతుంది. దానివల్ల త్వరగా నిర్జలీకరణం(డీహైడ్రేడ్) గురయ్యే ప్రమాదం ఉంది.
కాబట్టి మూత్రం ఎక్కువగా వచ్చినా పర్లేదు కానీ.. మంచి నీళ్లు ఎక్కువగా తాగడం మరిచిపోవద్దు. అయితే, నీళ్లు తాగాలనే ఉద్దేశంతో శీతల పానీయాలు, సోడాలు తాగేయకండి. నీళ్లు మాత్రమే తాగండి. ముఖ్యంగా కార్బొనేటెడ్ పానీయాలు, ప్యాక్డ్ జ్యూస్లకు దూరంగా ఉండండి. అంతగా తియ్యగా తాగాలనిపిస్తే కొబ్బరి నీళ్లు తీసుకోవడం మంచిది. అవి ఎంతో సురక్షితం కూడా.
అలాగే.. వర్షాకాలంలో షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు.. పచ్చి కూరగాయలను అస్సలు తినొద్దు. ఎందుకంటే.. వర్షాకాలంలో వాటి మీద చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి. అవి చాలా డేంజర్. ఒకవేళ పచ్చి కాయగూరలను తినే అలవాటు ఉన్నా అది ఏ కాలంలో కూడా మంచిది కాదు. కాయగూరలను ఉడికించి లేదా వండుకుని మాత్రమే తినాలి. అలాగే కాయగూరలను బాగా కడిగిన తర్వాతే వంటల్లో ఉపయోగించాలి.
వెనిగర్ లేదా నిమ్మరసం కలిపిన గోరు వెచ్చని నీటిలో ముంచి తీయడం ద్వారా బ్యాక్టీరియాను చంపేయొచ్చు. వీలైనంత వరకు ఎప్పుడూ వేడి వేడి ఆహారాన్ని మాత్రమే తినాలి. విటమిన్లు, పోషకాలు కలిగిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ సీజన్లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం ద్వారా రోగాలు, వైరస్ల ముప్పు నుంచి బయటపడొచ్చు.
వర్షాకాలంలోనే అనేక బ్యాక్టిరియాలు, క్రిములు యాక్టీవ్గా ఉంటాయి. అలాగే మరోవైపు కరోనా వైరస్ కూడా తన ఉనికి చాటుతోంది. ఇలాంటి సమయంలో మీరు ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. మీ చేతులను నిత్యం సానిటైజ్ చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్ ద్వారా శుభ్రం చేసుకోవాలి. చేతి గోళ్లల్లోనే క్రిములు ఎక్కువగా నివసిస్తాయి. కాబట్టి.. గోళ్లను కత్తిరించండి. గోరు వెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయండి.
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు వర్షంలో అస్సలు తడవొద్దు. వానల్లో తడిస్తే వెంటనే జ్వరం వచ్చేస్తుంది. అలాగే తడి బట్టలను కూడా వేసుకోవద్దు. తడి దుస్తులతో ఎక్కువసేపు గడిపినా జ్వరం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు పొడిగా ఉండేందుకే ప్రయత్నించండి. ముఖ్యంగా మీ పాదాలు శుభ్రంగా, పొడిగా ఉండేలా చూడండి. పాదాలు శుభ్రంగా లేకపోతే ‘డయాబెటిక్ ఫూట్’ సమస్య ఏర్పడే అకాశం ఉంది.