Home Unknown facts రాహుగ్రహ మూర్తి కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన అతి పెద్ద ఆలయం

రాహుగ్రహ మూర్తి కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన అతి పెద్ద ఆలయం

0

మన దేశంలో వెలసిన కొన్ని ఆలయాలలో నవగ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ప్రత్యేకంగా రాహుగ్రహ మూర్తి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. మరి రాహుగ్రహ మూర్తి వెలసిన ఈ ఆలయం ఎక్కడ ఉంది ? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

RahuGraha Alayamతమిళనాడు రాష్ట్రం, కుంభకోణానికి 5 కి.మీ. దూరంలో తిరునాగేశ్వరం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో అతి పురాతనమైన రాహుగ్రహ ఆలయం ఉంది. భారతదేశంలో రాహుగ్రహ మూర్తి కోసం ప్రత్యేకంగా నిర్మించబడిన అతి పెద్ద ఆలయం ఇది ఒక్కటే అని చెబుతారు.

ఈ ఆలయంలోని మూలవిరాట్టును నాగనాథన్ గా భక్తులు పిలుస్తారు. రాహువు ఇచట పరమేశ్వరుని ప్రార్ధించి ఆయనను సాక్షాత్కరింపచేసుకున్న క్షేత్రంగా ఈ తిరు నాగేశ్వరం పిలువబడుచున్నది. పూర్వకాలంలో నలుడు, గౌతముడు, పంచపాండవులు, పరశురాముడు, ఇంద్రుడు, సూర్యుడు మొదలగు గొప్ప మహాపురుషులందరు ఇచట పూజలు జరిపించినట్లు తెలియుచున్నది.

ఈ ఆలయంలో రాహుగ్రహ దోష నివారణకై ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయం వద్దే వెండితో చేసిన నాగపడగలు అమ్ముతారు. నిత్యం వచ్చే రాహుకాల సమయంలో రాహువుకు క్షిరాభిషేకం చేయిస్తుంటారు.

భక్తులు ఇచట ఒక మహిమగా చెప్పుకునే విశేషం ఏంటంటే రాహుకాల సమయంలో మాత్రమే క్షిరాభిషేకం జరిపినప్పుడు రాహువు శిరస్సు పై నుండి పాలు పోస్తే శిరస్సు దాటి కంఠ భాగం చేరేసరికి ఆ పాలు నీలం రంగులోకి మారిపోతాయి. మిగిలిన సమయాలలో ఆలా జరుగదు. అందువలన నిత్యం రాహుకాల సమయంలో క్షిరాభిషేకం జరిపించుటకు భక్తులు కుతూహుల పడతారు.

ఈ విధంగా ఎక్కడ లేని విధంగా రాహుగ్రహ మూర్తి వెలసిన ఈ అతిపెద్ద ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version