భారత్ లో అత్యంత విశేషంగా జరుపుకునే పండుగల్లో విజయ దశమి ఒకటి. నవరాత్రులు, దుర్గాష్టమితో దసరా ఉత్సవంగా జరుపుకునే ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. దసరా పండుగకు ఒకరోజు ముందు వచ్చే పండుగే ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని హిందువులలో చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.
రైతులు అయితే కొడవలి, నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు, టైలర్లు తమ కుట్టు మిషన్లకు, చేనేత కార్మికులు మగ్గాలకు, ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమతో అద్ది వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు.
పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అర్జునుడు గాండీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్లడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు.
పంచప్రక్రుతి మహా స్వరూపాలలో దుర్గావేది మొదటిది. బవబంధాల్లో చిక్కుకున్న వ్యక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈరోజు స్మరించుకుంటే.. శత్రు బాధలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం.
ప్రస్తుతం ఆయుధ పూజలంటే ఆట వస్తువుల నుండి వంట వస్తువుల దాకా పాకింది. కరోనా వంటి మహమ్మారి కాలంలో చాలా మంది తమ బ్యాట్లు, క్రికెట్ కిట్లు, గ్యాస్ స్టవ్, ఫోన్లు, కంప్యూటర్ల వంటి వాటిని పూజిస్తున్నారు.