మన పండుగలు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అలాంటి వాటిలో విశిష్టమైంది వినాయకచవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. అయితే వినాయక చవితి ఉత్సవాలలో ఎక్కువగా మనకు వినిపించేది గణపతి బప్పా’మోరియా’. ఈ పదానికి వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం…
పూర్వం చక్రపాణి అనే రాక్షస రాజు గండకిని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య ఉగ్ర, వారికి పిల్లలు లేనందున శానక మహాముని సూచనమేరకు భార్యాభర్తలు సూర్యోపాసన చేసారు. సూర్యభగవానుని అనుగ్రహం వల్ల రాణి గర్భం దాల్చింది. గర్భంలో ఉన్న పిల్లవాడు సూర్యునివంటి వేడితో ఉండటం చేత భరించలేక ఆ గర్భాన్ని ఆమె సముద్రంలో వదిలింది.
సముద్రంలో జన్మించిన ఆ పిల్లవానిని సముద్రుడు బ్రాహ్మణరూపంలో వచ్చి, చక్రపాణి దంపతులకు సమర్పించాడు. సముద్రంలో పుట్టిన ఆపిల్లవానికి, వారు సింధు (సముద్రము) అని నామకరణం చేసారు. సింధు పెద్దవాడై సూర్యోపాసకుడై 2000 సంవత్సరాలు తపస్సుచేసి, సూర్యుని నుండి అమృతాన్ని పొందాడు.
సూర్యునివరముచేత అమృతం పొందాడు, అమృతం అతని ఉదరంలో ఉన్నంతకాలం, అతనికి మృత్యు భయం ఉండదు. ఈ ధైర్యంతో సింధురాసురుడు తన పరాక్రమముతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడు. ముందు దేవతలను జయించి వారిని కారాగారంలో బంధించాడు. తరువాత కైలాసం, వైకుంఠాలపై దండెత్తాడు.
పార్వతీపరమేశ్వరులు కూడ సింధురాసుని బాధలుపడలేక కైలాసాన్ని వదిలి, మేరుపర్వతంలో ఉన్నారు. సింధురాసురుడు శ్రీ మహావిష్ణువును తన గండకి రాజ్యంలో ఉండమని ఆజ్ఞాపించాడు. ఈ పరిస్థితులలో దేవగురువైన బృహస్పతి, సింహారూఢుడు, పది చేతులు కలవాడు అయిన వినాయకుని ప్రార్ధించి, ఆయనను శరణు వేసుకోండి అని దేవతలకు సలహాఇచ్చాడు. వారు అలాగే చేసారు. వారి ప్రార్థనలను మన్నించి, గణపతి సాక్షాత్కరించి, తాను పార్వతీదేవికి కుమారుడుగా జన్మించి, సింధురాసురుని చంపేస్తానని మాట ఇచ్చాడు.
మేరు పర్వతంలో, పరమేశ్వరుని ఉపదేశానుసారంగా పార్వతి 12 సంవత్సరాలు గణేశ మంత్రాన్ని జపించాడు. ఆ జపానికి సంతుష్టుడై గణపతి పార్వతికి ప్రత్యక్షమై, ఆమె కోరిక ప్రకారం ఆమెకు పుత్రుడుగా జన్మించి, సింధురాసురుని చంపేస్తానని వాగ్దానం చేసాడు.
ఇచ్చిన మాట ప్రకారం ఒక భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణపతి పార్వతికి పుత్రుడుగా జన్మించాడు. ఆ పుత్రుడికి గణేశుడు అని నామకరణం చేసారు.
కొంతకాలానికి సింధురాసురుని మిత్రుడయిన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్ళాడు. అప్పడు గణపతి నెమలి వాహనారూఢుడై కమలాసురునితో ఘోరయుద్ధం చేసాడు. కమలాసురుని నేత్తురునుండి అనేక మంది రాక్షసులు ఉద్భవించటం చేత, అతనిని చంపడం కష్టమైంది.
అప్పడు గణపతి బ్రహ్మదేవుని పుత్రికలైన బుద్ధి, సిద్దులను స్మరించి, వారిని కమలాసురుని నెత్తురు నుండి పుట్టుకొస్తున్న రాక్షసులను మింగేయాలని కోరాడు. ఆ విధంగా వారి సహాయంతో గణపతి కమలాసురుని ఎదుర్కొని తన శిరస్సును ఖండించాడు. ఆ శిరస్సు మోర్గాంక్షేత్రంలో పడింది. తరువాత, గణపతి పార్వతీ పరమేశ్వరులతో కలిసి గండకికి వెళ్ళి, దేవతలను చెరసాలనుండి విడిపించు అని సింధురాసురునికి ఆజ్ఞఇచ్చాడు.
అతడు ఆ ఆజ్ఞను పాటించనందుకు, అతనితో 3 రోజులు గణపతి ఘోర యుద్ధం చేసాడు. చివరకు సింధురాసురుడు ఖడ్గం ధరించి గణపతి వైపు పరిగెత్తాడు అప్పడు గణపతి చిన్న రూపాన్ని ధరించి, నెమలి వాహనాన్ని వీడి, క్రింద నుండి సింధురాసురుని ఉదరంపై ఒక బాణం వేసాడు. అది అతని ఉదరాన్ని చీల్చి వేసింది. వెంటనే ఉదరంలో ఉన్న అమృతమంతా బయటకు వచ్చింది. దానితో సింధురాసురుడు మరణించాడు. దేవతలు ఆనందించి, గణపతిని పూజించి కొనియాడారు.
అప్పడు మోర్గాంక్షేత్రంలో దేవాలయాన్ని నిర్మించి, గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విధంగా మోర్గాం, మోరేశ్వర్ గణపతి పుణ్యక్షేత్రమైంది. గణపతి మయూర వాహనంపై వచ్చినందుకు, ఆయనకు మయూరేశ్వర్ అను పేరుకూడ వచ్చింది.
మరాఠీ భాషలో మోర్’ అంటే నెమలి. ఆ ప్రదేశంలో నెమళ్ళు ఎక్కువగా ఉండటం చేత, ఆ గ్రామానికి మోర్గాం’ అనే పేరు వచ్చింది. నెమలిని వాహనం చేసుకున్నందుకు గాను, గణపతి మోరేశ్వర్ అయ్యాడు.
అందుకే ‘గణపతి బప్పా మోరియా’ అని భక్తులు అంటారు. ఈ కథను చెప్పేవారికి, వినే వారికి, చదువేవారికి శ్రీమోరేశ్వరానుగ్రహం చేత సమస్త కోరికలు ఫలిస్తాయి. ధన సంపత్తి, యశస్సు ప్రాప్తిస్తుంది. మోర్గాం పూణేకు 79 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.