Home Unknown facts తిరుమల బ్రహ్మోత్సవాలలో చివరగా సుదర్శన చక్రస్నానం చేయించడానికి కారణం???

తిరుమల బ్రహ్మోత్సవాలలో చివరగా సుదర్శన చక్రస్నానం చేయించడానికి కారణం???

0

బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు. ఉత్సవాలు చేసిన వారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతుంటారు.

balajiశ్రీవారి బ్రహ్మోత్సవాల ముగింపు కోనేటి జలాల్లో పవిత్ర స్నానంతో ముగుస్తుంది. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహనాల పేరిట ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు తొమ్మిదో రోజు ఉదయం పవిత్ర పుష్కరిణి స్వామి వారి సుదర్శన చక్రస్నానంతో పరిసమాప్తి అవుతుంది. బ్రహ్మోత్సవాలనే పవిత్ర యజ్ఞానికి ముగింపు పలికే…ఈ చక్రస్నానం కూడా అవబృధస్నానమే అవుతుందని శాస్త్రాలు చెబుతుంటాయి.

శ్రీ‌వారి ఆల‌యంలోని ఐనా మ‌హ‌ల్ ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం ప్ర‌త్యేకంగా నిర్మించిన చిన్న పుష్క‌రిణిలో ఉద‌యం సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో ముంచి స్నానం చేయిస్తారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహిస్తారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహిస్తారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేస్తారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరిస్తారు.

తొమ్మిది రోజుల ఉత్సవాలలో జరిగే అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతులతో ఉండడానికీ – చక్రస్నానం నిర్వహిస్తారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కాబట్టి యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంత స్నానం అవభృథం అంటారు. చక్ర స్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది.

Exit mobile version