హయగ్రీవుడు జ్ఞానానికి, వివేకానికి, బుద్దికి, వాక్కుకు దేవుడు. హయగ్రీవుడు హయము. అంటే ‘గుర్రము’. గుర్రం ముఖంగా కలవాడు అని అర్థం. ఈయన తెల్లని శరీరచ్చాయతో, నాలుగు చేతులతో వెలుగొందుతున్నాడు. ఆ నాలుగు చేతులలో, శంఖము, చక్రము, పుస్తకం, అభయ హస్తంతో ఉంటూ భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తుంటాడు.
”జ్ఞానానందమయం దేవం, నిర్మల స్పటికాకృతమ్!
ఆధారం, సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహ!!” అని ఆయనను ఆరాధిస్తాం. మహా విష్ణువు స్వరూపమే హయగ్రీవుడు
హయగ్రీవుని బుధవారం పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. సాధారణంగా కష్టాలతో సతమతమవుతున్న వారిని ఆ దేవుడే కాపాడాలని అంటారు. అలాంటి వారిని కాపాడడం కోసమే శ్రీమహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ఈ హయగ్రీవుని అవతారం కూడా ఒకటి.
పురాణాల ప్రకారం హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు గుర్రం తలను కలిగి ఉండి ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం కఠినమైన తపస్సుచేసి ఆ బ్రహ్మ దేవుడు నుంచి వరం పొందుతాడు. తన ఆకారాన్ని పోలిన వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించాలనే వరాన్ని హయగ్రీవుడు బ్రహ్మదేవుడిని అడుగుతాడు. బ్రహ్మదేవుడు నుంచి ఆ వరం పొందిన హయగ్రీవుడు ఎంతో గర్వంతో సాదు సత్పురుషులను నానా రకాలుగా హింసించేవారు.
దాంతో దేవతలందరూ కలిసి ఆ ఆది దంపతులను హయగ్రీవుడు నుంచి కాపాడాలని వేడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి యోగనిద్రలో ఉన్న ఆ విష్ణు భగవానుని మేల్కొల్పితే ఆయనే హయగ్రీవుని సంహరిస్తాడని దేవతలతో చెప్పడంతో, తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకొని నిద్రిస్తున్న విష్ణు భగవానుడిని మేల్కొలపడానికి శివుడు చెద పురుగుగా మారి ఆ వింటి తాడును లాగుతాడు.
దాంతో ఒక్కసారిగా బాణం పైకి వెళ్లి ఆ విష్ణుమూర్తి తలను ఖండిస్తుంది. తల తెగడం వెనుక ఉన్న కారణాన్ని గ్రహించిన ఆదిదంపతులు గుర్రం తల తెచ్చి ఆ విష్ణుమూర్తికి అతికిస్తారు. అమ్మవారితో సహా దేవాది దేవుళ్ళు తమ జ్ఞానాన్ని, శక్తిసామర్థ్యాలను గుర్రంతలతో పోలి ఉన్న ఆ మహావిష్ణువుకు ధారపోస్తారు. అందుచేతే హయగ్రీవుని విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. తన అవతారం వెనుక ఉన్న ఈ కార్యాన్ని నెరవేర్చిన శ్రీ మహావిష్ణువు సతీ సమేతంగా దేవతలకు దర్శనమిచ్చాడు.
విష్ణుమూర్తి ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కావడం వల్ల ఆరోజు ఎవరైతే స్వామి వారిని దర్శించుకుంటారో వారికి విద్య, విజ్ఞానం లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే బుధవారం రోజున హయగ్రీవుని యాలకుల మాలతో పూజించడం వల్ల మనం అనుకున్న కార్యాలు ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.