మనం పడుకున్నప్పుడు వివిధ రకాల కలలు అనేవి వస్తుంటాయి. అయితే పడుకొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నిజంగా మన కళ్ల ముందే జరుగుతుందా అనే విధంగా కలలు అనేవి వస్తుంటాయి. మరి నిద్రించే సమయంలో కలలు ఎందుకు వస్తాయి? అసలు కలల రహస్యం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఋగ్వేదం లోని మంత్రపుష్పం లో హృదయం వర్ణించబడింది. హృదయ స్థానం తిరగవేసిన తామరమొగ్గల ఉంటుంది. మనిషి బొడ్డు నుంచి గుండెల మీదకు ఒక జాన కలిస్తే అక్కడ ఉంటుందట. ఈ హృదయంలోనే ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ, పరమాత్మ ఉంటారు. పరమాత్మ ఇచ్చిన ఉనికి వలన ఇక్కడి నుండే ఆత్మ యొక్క జ్ఞానం మనస్సు, ఇంద్రియాల ద్వారా వెలికి వచ్చి శరీరం అంతా వ్యాపిస్తుంది. శతంచ ఏకాంచ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా ఈ ఆత్మ యొక్క జ్ఞాన ప్రసరణ మార్గాలు 101 నాడులు. ఇవి హృదయ గ్రంధి నుంచి శరీరపు చిట్టచివరి అణువు వరకు ప్రసరించి ఉంటాయి. ఆత్మ నుంచి ప్రసరించే జ్ఞానం, ఆత్మకు తోడులాగా అమరివుండే మనస్సు ద్వారా బయటికి వచ్చి మనస్సు పై ఉన్న జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల ద్వారా ప్రసరిస్తూ, 101 నాడుల ద్వారా శరీరమంతా వ్యాపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా కాకుండా నేరుగా కూడా మనస్సు నుండి ఆత్మ యొక్క జ్ఞానం ప్రసరించగలగడం.
ఇక విషయంలోకి వెళితే, మీరు మెలుకువగా ఉన్నప్పుడు మీరు చేసినవి చూసినవి అన్ని మీ మనసులో అలానే ఉండిపోతాయి. నిద్రిస్తున్నప్పుడు మీ శరీర అవయవాలు విశ్రాంతి తీసుకున్న, ఇంద్రియాలు ఇంకా విశ్రాంతి తీసుకోకపోతే ఆత్మజ్ఞానం మనసు ద్వారా బయటికి వచ్చి ఇంద్రియాల ద్వారా వెలికిరావాలని చూస్తుంది. కానీ అవయవాలు విశ్రాంతిలో ఉండటం వలన నాడుల ద్వారా అక్కడివరకు వెళ్లకుండానే తిరిగి వచ్చి మనసులోకి ఆ జ్ఞానం ప్రవేశించి ఆయా ఇంద్రియాలకు సంబంధించిన సంస్కారాలను కెలుకుతుంది.
ఇలా సంస్కారాలను అడ్డదిడ్డంగా కెలకడం వలన అడ్డదిడ్డమైన కలలు, క్రమ పద్దతిలో స్మృశించడం వలన అర్థవంతమైన కలలు వస్తుంటాయి. నిద్రిస్తున్నప్పుడు ఇంద్రియాల పైన నియంత్రణ ఉండదు కనుక కలలకి అంతు అనేది లేకుండా ఉంటుంది. ఇంకా గాఢ నిద్రలో అయితే మనస్సు కూడా పనిచేయదు. అప్పుడు ఆత్మ నుంచి భావప్రసారమే ఉండదు. కాబట్టి ఇక కలల ఊసే ఉండదు.