క్యాన్సర్.. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న ఓ మహమ్మారి. ఇటీవల కాలంలో చాలామందిని బలి తీసుకుంటున్న ప్రధానమైన జబ్బులలో ఒకటి క్యాన్సర్. వయసుతో సంబంధం లేకుండా ఈ మహమ్మారి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఫలానా కారణం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది. జీర్ణాశయమునకు సంభవించే క్యాన్సరే జీర్ణాశయ క్యాన్సర్. ఈ తరహా క్యాన్సర్లు మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన దగ్గర కారం వినియోగం ఎక్కువ కాబట్టి ఈ తరహా క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ క్యాన్సర్ లక్షణాల్లో ప్రధానంగా ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, కడుపులో ఎప్పుడూ ఏదో అసౌకర్యంగా అనిపించడం వంటివి కనిపిస్తాయి. వీటితో పాటు ఏ కొంచెం అన్నం తిన్నా కడుపు నిండిపోయినట్లు అనిపించడం, ఏదీ రుచిగా అనిపించకపోవడం, ఛాతీలో మంట అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాల్ని చాలా మంది కడుపు ఉబ్బరం సమస్య అనుకుంటారు. కానీ, ఒక్కోసారి అది జీర్ణాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు. కొంతమందికి అజీర్తి సమస్యగా కూడా అనిపిస్తుంది. వికారం, వాంతులు, వాంతిలో కొన్ని సార్లు రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కడుపు మీదినుంచి తడిమితే చేతికి గడ్డలా తగలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చాలా మంది ఈ లక్షణాలన్నిటినీ గ్యాస్ సమస్యగానే తీసుకుని డైజిన్, జెంటాక్ లాంటి మాత్రలు వేసుకుంటూ ఉండిపోతారు. క్యాన్సర్ కణితి తాలూకు రక్తం కొన్నిసార్లు బయటికి రాకుండా పేగుల్లోకి వెళ్లిపోయి రక్తం కూడా జీర్ణమవుతుంది. అందుకే నల్లటి విరేచనాలు రావచ్చు. అలా రావడాన్ని మెలీనా అంటారు. అప్పటికే క్యాన్సర్ ముదిరిపోయి ఉంటే పొట్ట ఉబ్బిపోవడం, పొట్టలోకి నీరు రావడం, జాండిస్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇటువంటి లక్షణాలు ఎక్కువ రోజులుగా కనిపిస్తుంటే వెంటనే డాక్టర్ను కలవడం ఎంతో అవసరం. వ్యాధినిర్ధారణకు ఎండోస్కోపీ ఎంతో ఉపయోగపడుతుంది. నిజంగానే అది క్యాన్సరా? లేక అల్సరా తెలిసిపోతుంది. ఒకవేళ క్యాన్సర్ కణితే అయితే అది ఏ భాగంలో ఉంది, ఇంకా ఇతర భాగానికేమైనా పాకిందా తెలిసిపోతుంది.