ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు లేదా నాన్ వెజ్ లాంటివి తిన్నప్పుడు ఒంట్లో వేడి చేయడం చూస్తూనే ఉంటాం. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 97.7 నుంచి 99.5 డిగ్రీల ఫారన్హీట్ మధ్యలో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ గానీ తక్కువగానీ ఉంటే ఏదో అనారోగ్యం ఉందని భావించవచ్చు. ఎండలో ఎక్కువ సమయం గడపడం వలన మీ శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. భారీ వ్యాయామం లేదా మామూలు కంటే ఎక్కువ తిరగడం వల్ల కూడా ఇది పెరుగుతుంది. మహిళలకు, పెరిమెనోపాజ్ మరియు మెనోపాజ్ వంటి పరిస్థితుల కారణంగా శరీర వేడి పెరగవచ్చు.
కొన్ని మందులు మీ శరీరంలో అధిక ఉష్ణ ఉత్పత్తికి కారణమవుతాయి, దీని వలన మీ శరీర వేడి పెరుగుతుంది. ఒంట్లో వేడి ఎక్కువైతే ముఖం మాడిపోయి నట్లుగా ఉండి.. అందవికారంగా మారుతుంది. పెదాలు నల్లబడి ఎండిపోయినట్టుగా ఉంటాయి. ఇవే కాకుండా మూత్రం లో మంట, మలబద్ధకం, కళ్ళు మంట, కడుపు లో మంట, తలనొప్పి ,అలసట, నీరసం, కారణం లేకుండా కోపగించుకోవడం వంటి లక్షణాలు స్పష్టం గా కనిపిస్తాయి.
మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. అలాంటప్పుడు మెడిసిన్పై ఆధార పడకుండా సహజంగా నే శరీర యొక్క వేడి సమస్య ను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. తరుచుగా మనం తీసుకునే ఆహారం, ఇతర ఆహారపు అలవాట్లతో శరీరం లో ఉండే అధిక వేడిని తగ్గించవచ్చు.
శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే తరచుగా నీళ్లు, ఏదైనా ద్రావణాలను తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది. ఫ్రిజ్ లో పెట్టిన నీరు కాదు. మామూలు నీటిని మాత్రమే తీసుకోవాలి. వేడిని తగ్గించడం లో నీరు పనిచేసినట్టుగా మరి ఏది పని చేయదని నిపుణులు చెప్పే మాట. నీటిని ఎక్కువ తాగలేము అనుకుంటే మాత్రం మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. ఇలా చేస్తుంటేనెమ్మదిగా వేడి తగ్గుతుంది.
ఉదయాన్నే గ్లాసుడు నిమ్మరసం తాగితే… ఒంట్లో వేడి తగ్గుతుంది. ఉప్పు, లేదా పంచదార వేసుకుని నిమ్మ నీళ్ళ తాగొచ్చు. దానిమ్మ జ్యూస్ తీసి, అందులో ఆల్మండ్ ఆయిల్ నాలుగు చుక్కలు వేసుకుని తాగితే చలవ. గ్లాసుడు పాలలో రెండు టేబుల్ స్పూన్ల వెన్న కలుపుకొని తాగితే వేడి తగ్గుతుంది. గ్లాసుడు పాలలో చెంచాడు తేనె కలుపుకొని తాగితే శరీరం అంతా కూల్. గంధం చల్లని నీరు, లేదా పాలతో కలిపి నుదుటకు రాసుకుంటే వేడి మటుమాయం. అన్నింటికీ మించి కొన్ని బార్లీ గింజలు వేడి నీళ్ళలో కాచి, మజ్జిగ వేసుకుని పలచగా తాగితే వేడి తగ్గుతుంది.
ఒక స్పూన్ మెంతుల్ని అలాగే తినాలి. లేకపోతే వాటిని పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది. లేదా ఒక టేబుల్ స్పూన్ మెంతులు నిత్యం చేసుకునే ఆహార పదార్ధాలలో వాడండి… అంటే కూరలు, పులుసులు చేసేటపుడు వేసే పోపులో ఇవి ఉంటే చాలు. మెంతులు మన శరీరంలోని వేడిని బాగా లాగేస్తాయి. అధిక వేడి నుంచి ఉపశనమనం లభిస్తుంది.
కర్బూజా పండ్లకు చలవ చేసే గుణం అధికం . కర్బూజా పండు మందపాటి తోలు తీసేసి, చిన్న ముక్కలుగా తరిగి, పంచదార చల్లుకుని తింటే క్షణాలలో వేడి తగ్గుతుంది. స్విమ్మింగ్ వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త మేర తగ్గుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మణికట్టు, ఛాతీ లాంటి బాగాల్లో చల్లని నీళ్లను, లేక ఐస్ను రాస్తే ఒక్కసారిగా ఉపశమనం లభిస్తుంది. అలోవెరా జ్యూస్ చలవ చేస్తుంది… దాని ఆకుల మధ్య జెల్ నుదుటికి రాసుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది.
గసగసాలు వేడిని బాగా తగ్గిస్తాయి… కానీ, మోతాదు మించి తీసుకోవద్దు. థైరాయిడ్ ఎక్కువ యాక్టివ్గా ఉంటే శరీరంలో అధిక వేడి పుడుతుందని తెలిసిందే. కొన్ని సందర్భాలలో దీనివల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, అధిక చెమట, జాండీస్ వస్తుంటాయి. డాక్టర్ను సంప్రదించి వారి సలహాలు పాటించాలి. శరీరంలో వేడి అధికంగా ఉంటే నాన్ వెజ్, స్పైసీ, జంక్ ఫుడ్ మరియు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది. గాలి బాగా ఉన్న చోటనే కూర్చోవాలి. తగినంత ఆక్సిజన్ అందే పరిస్థితి లేకపోతే శరీరంలో మార్పులు చోటుచేసుకుని బాడీ టెంపరేచర్ పెరగినట్లు అనిపిస్తుంది. ఫ్యాన్ కింద, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు కూర్చోవాలి.