తరచుగా చిన్న పిల్లలకు దిష్టి తగులుతుంది. పెద్దవారికి కూడా కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంది. నరుని దృష్టి తగిలితే… నల్లరాయి అయినా బద్దలైపోతుంది. అనే సామెత ఊరికే రాలేదు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి మన పూర్వీకులు నమ్ముతున్న విశ్వాసం. ఈ దృష్టి( దిష్టి) తగలటం అనే విశ్వాసాన్ని బహుశా నమ్మనివారు లేరంటే అతిశయోక్తి కాదేమో.
పదిమంది దృష్టిలో పడినా, పదిమంది నోళ్లలో మన పేరు నానినా, ఖచ్చితంగా దిష్టి తగిలిందని అప్పటికప్పుడు మట్టి పిడతలోని ఉప్పును తీసి తల చుట్టూ మూడుసార్లు తిప్పి పొయ్యిలో వేసేవారు. ఇలా దిష్టిని తొలగించే ప్రక్రియలు పలు చోట్ల పలు రకాలుగా ఉన్నాయి. అసలు దిష్టి తగలకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
పిల్లలు చదువులో మంచి మార్కులు సాధిస్తున్నప్పుడు, మా వాడు క్లాసులో ఫస్టు అని ఊరంతా చాటింపు వేయకండి. దీనివల్ల మీ పిల్లవాని పేరు అందరి నోళ్లలో నానుతుంది. అతిగా ఖర్చు చేస్తున్నట్లు నలుగురికీ కనబడకండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే.. ఇంత ఖర్చుపెడుతున్నారు అని అందరూ మీ గురించే చర్చించుకుంటారు.
మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి. అంతేకానీ, నేను అన్ని విషయాలలో సమర్థుడనని నిరూపించుకోవడానికి మీరు చేసే ప్రతి పనిని నలుగురిలో పెట్టకండి. ఇలా చేయడం వలన మీపై లేనిపోని అంచనాలు పెరుగుతాయి. అందరూ మీ వైపే దృష్టి సారిస్తారు. కనుక సాధ్యమైనంత వరకూ డాంబికాలకు పోకుండా ఉంటే దృష్టి తగిలే అవకాశం ఉండదు. ఏ పనిని అందరు గుర్తించాల్సిన అవసరముందో దాననే అందరికి తెలిసేట్లు ప్రవర్తించండి. చిన్నపిల్లలకైతే నల్ల రంగు బొట్టు, నల్లని దారాన్ని ధరిస్తే దిష్టి తగలకుండా కొంతవరకు నివారించవచ్చు. పెద్దవారు కుంకుమ ధరించడం వల్ల దిష్టి ప్రభవాన్ని తగ్గించవచ్చు.