మన జీవితంలో కాఫీ,టీ లు భాగంగా మారిపోయాయి. ఉదయం, సాయంత్రం టీ గొంతులో దిగకపోతే కుదురుగా ఉండలేరు. కొందరు టీ కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. రోజులో కనీసం నాలుగైదు సార్లు తాగనిది పని చేయలేరు, ఏకాగ్రత పెట్టలేరు. అలాగే చాలామందికి రోజూ నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. బెడ్పై ఉండే కాఫీ తాగి తరువాత దైనందిన కార్యక్రమాలను మొదలు పెడతారు.
లేవగానే టీ లేదా కాఫీ తాగనిదే.. అస్సలు బుర్ర పనిచేయదు. బెడ్ కాఫీతో రోజును ప్రారంభించేవారు కూడా ఎందరో ఉన్నారు. తెల్లవారుఝామునే ఛాయ్ లేదా కాఫీని సేవించడం వల్ల.. రోజును ఫ్రెష్గా ప్రారంభించే వీలుంటుందనేది వారి ఫీలింగ్. అయితే నిజానికి ఈ అలవాటు అంత మంచిది కాదని సైంటిస్టులు చెబుతున్నారు. నిత్యం బెడ్ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని తేల్చారు.
రాత్రి నుండి ఖాళీగా ఉన్న కడుపులో.. ఉదయాన్నే టీ లేదా కాఫీ పోయడం వల్ల.. మీకు నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల టీ లేదా కాఫీ తాగడం వల్ల.. శరీరానికి ఏ సమస్యా లేకపోయినా.. ఉదయాన్నే తాగడం వల్ల మాత్రమే ఇబ్బందులున్నాయట. టీ లేదా కాఫీని పరగడుపున తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి.
ఒక్కోసారి రాత్రి తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతూ ఉంటుంది. అందుకే ఉదయాన్నే మన శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంది. కాబట్టే ఉదయాన్నే ఓ లీటర్ మంచి నీళ్లు తాగాలని వైద్యులు చెబుతుంటారు. మంచినీటికి బదులుగా పరగడుపునే టీ, కాఫీ తాగడం వల్ల.. మళ్లీ డీహైడ్రేషన్ బారిన పడే అవకాశముంది. పేగులపైనా ప్రభావం పడుతుంది. దీనివల్ల మీ ఆకలి తగ్గిపోవడంతో పాటు.. జీర్ణ ప్రక్రియ కూడా నెమ్మదిగా మారుతుంది.
పొద్దున లేవగానే బ్రష్ చేయకుండా టీ, కాఫీ తాగేవారికి.. పళ్లల్లో పిప్పి, పంటి నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే.. అదో వ్యసనంగా మారే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అది తాగకపోతే మీరు రోజంతా అలసిపోయిన ఫీలింగ్కి గురవుతారు. ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం వల్ల మీరు రోజంతా పనిచేయకపోయినా.. అలిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కెఫీన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, కోలా వంటివి తీసుకోవడం వల్ల.. కళ్లు తిరగడంతో పాటు వాంతులయ్యే అవకాశం కూడా ఉంది. రాత్రి నుండి ఏమీ తినకుండా.. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల మన పిత్తాశయం పై ప్రభావం పడుతుందట. దీని వల్ల పైత్య రసం పెరుగుతుంది. శరీరంలో పైత్య రసం పెరగడం వల్ల.. తల నొప్పి రావడంతో పాటు గుండెల్లో మంటగా కూడా అనిపిస్తుంది.
ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగాలనిపిస్తే దానికి బదులుగా.. అంతే వేడిగా ఉన్న నీటిని తీసుకోండి. ఆ నీటిలో డ్రైఫ్రూట్స్ వంటివి నానబెట్టుకొని.. నీళ్లు తాగి వాటిని తినడం మరింత మంచిది. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల రాత్రంతా కడుపులో నిల్వ ఉన్న యాసిడ్ వల్ల.. శరీరానికి ఏ సమస్యా ఎదురుకాకుండా ఉంటుంది.