Home Unknown facts కార్తీక సోమవార వ్రత విధానం పాటించాల్సిన నియమాలు

కార్తీక సోమవార వ్రత విధానం పాటించాల్సిన నియమాలు

0

హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.

కార్తీక మాసంఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి “హరహరశంభో” అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం. సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.

కార్తీక మాసంలో ఆధ్యాత్మికపరమైన అనేక విశేషాల సమాహారం. ఈ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. సాధారణంగా పరమశివుడికి సోమవారం ప్రీతకరమైన వారం. సోమ అంటే స -ఉమ అనేఅర్థం ఆవిష్కరించబడుతోంది. స-ఉమ అంటే ఉమతో కూడినవాడుగా శివుడు చెప్పబడుతున్నాడు. ఈ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలోని సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా కనిపిస్తుంటాయి. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి, పూజ మందిరాన్ని అలంకరించాలి. భక్తి శ్రద్దలతో శివలింగాన్ని అభిషేకించి బిల్వ దళాలతో అర్చించాలి.

శివుడిని బిల్వ దళాలతో పూజింపబడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి, పరమ శివుడుకి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజు నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. ఈ రోజున శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాన్ని వెలిగించాలి.

ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వల్ల సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుడిని ఆరాధించడం వల్ల మోక్షానికి అవసరమైన అర్హతను పొందడం జరుగుతుందని ఆదిదేవుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు, కార్తీక మాసంలో చివరి సోమవారన్ని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ రోజంతా సదాశివుడి సేవలో తరించాలి.

Exit mobile version