మన దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ వెలసిన అమ్మవారి ఆలయం పవిత్ర పుణ్యక్షేత్రంగా, విహార యాత్ర స్థలంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. హిమాలయాలకు దగ్గర ఉండే ఈ ప్రాంతంలో ఏర్పడ్డ సరస్సులన్నిటిలో సహజంగా ఏర్పడిన సరస్సు గా దీనిని చెబుతారు. అంతేకాకుండా ఇక్కడ చలి అనేది అసలు ఉండదు. మరి ఇక్కడ కొలువైన అమ్మవారు ఎవరు? ఆలయం స్థల పురాణం ఏంటి? సజహంగా ఏర్పడిన ఈ సరస్సు దగ్గర చలి అనేది ఎందుకు ఉండదు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచలప్రదేశ్ రాష్ట్రంలో రేణుక అనే గ్రామంలో రేణుకాదేవి ఆలయం ఉంది. హిమాలయాల పర్వతాలకు ఇవతలాగా ఉన్న మైదాన ప్రాంతానికి మధ్యలో కొండల మధ్య కొలువై ఉన్న శివాలిక్ పర్వత శ్రేణులకు, హిమాలయ పర్వతాలకు మధ్యలో రేణుక అనే గ్రామం ఉంది. ఇక్కడ వెలసిన రేణుక దేవి అమ్మవారి పేరుమీదుగానే ఈ గ్రామానికి ఆ పేరు వచ్చినది. ఈ ఆలయ స్థలపురాణానికి వస్తే, ఇక్కడ ఉన్న సరస్సు ఒడ్డున మహావిష్ణువు అవతారమైన పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞమేరకు తన తల్లి రేణుక దేవి శిరస్సును ఖండించాడని, తండ్రి ఇచ్చిన వరంతో తిరిగి తన తల్లిని బ్రతికించుకున్నాడని స్థల పురాణం. అందుకే ఈ సరస్సు ఒడ్డున రేణుకాదేవికి, పరశురాముడికి వేరు వేరుగా ఆలయాలను నిర్మించారు. ఇక ఆలయ విషయానికి వస్తే, రేణుకాదేవి ఆలయం ఒకే ఒక్క రాతితో నిర్మాణమైనట్లుగా చెబుతారు. ఈ ఆలయానికి దగ్గర్లోనే ఒక పెద్ద సరస్సు ఉంది. హిమాచలప్రదేశ్ మొత్తం మీద సహజంగా ఏర్పడిన సరస్సులలో ఇదే అతి పెద్ద సరస్సు అని చెబుతారు. ఈ సరస్సు శివాలిక్ పర్వతశ్రేణుల వరుసలకు, హిమాలయ పర్వతాలకు మధ్యలో ఉన్న చిన్న లోయలాంటి ప్రదేశంలో ఈ స్థలం అతి పవిత్రమైన తీర్థక్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఈ రేణుక అనే గ్రామం ఎత్తు కేవలం 600 మీటర్లు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ ఇక్కడ ఎక్కువగా చలి అనేది ఉండదు. ఈ ఆలయానికి 50 కిలోమీటర్ల దూరంలో పావంటసాహెబ్ అనే పవిత్ర క్షేత్రం ఉంది. సిక్కుల గురువులలో ఆఖరివాడైన గురుగోవింద సింగ్ జీవితంతో సంబంధం ఉన్న క్షేత్రంగా దీనిని చెబుతారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు నడుమున ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని చూసి తరించడానికి అనేకప్రాంతాల నుండి యాత్రికులు అధిక సంఖ్యలో వస్తుంటారు.