మన దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీ మంగళగౌరి దేవి ఆలయం కూడా ఒకటిగా వెలుగొందుచున్నది. సతీదేవి వక్షస్థలం పడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు సుమారు 96 కి.మీ. దూరంలో, గయ బస్టాండ్ నుండి 3 కి.మీ. దూరంలో, విష్ణుపద మందిరానికి కి.మీ. దూరంలో ఫల్గుణీ నది తీరంలో శ్రీ మంగళగౌరి దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం తూర్పుముఖంగా మంగళగిరి అనే పర్వతం పై నెలకొని ఉంది.
ఈ ఆలయంలో అమ్మవారిని భక్తులు మంగళ గౌరీ లేక సర్వమంగళాదేవి అని పిలుస్తారు. ఈ ప్రదేశం ఫల్గుణీ, మధుర, శ్వేద నదుల సగమస్థానముగా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇక్కడ దశావతారాలు చెక్కిన ఆలయం, మహిషాసుర మర్దిని ఆలయం, అరణ్య దేవి ఆలయం, కాళిదాసుని కరుణించిన దేవత, రాత్రి పూట మాత్రమే ఆరాధించే ఓ స్వామి ఆలయం, నిరంజన, అహల్యాదేవి ఆలయాలు ఈ పవిత్ర గయా క్షేత్రంలో ఉన్నాయి.
ఈ ఆలయంలో గర్భాలయం వైశాల్యం తక్కువగా ఉంటుంది. ఇక్కడ కేవలం ఇద్దరు లేక ముగ్గురు వెళ్ళడానికి మాత్రమే లోపలకు వీలు ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా గణేశమందిరం ఉంటుంది. ఇక గర్భాలయంలో ఉన్న దేవి పట్టువస్ర్తాలతో, రాక్షస సంహారిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మంటపం, హోమగుండం ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో నంది, నందికి ఎదురుగా శివలింగాకారంలో ఉన్న పరమేశ్వరుడు భక్తులకి దర్శనమిస్తారు.
ఈ ప్రాంతంలోనే ఉన్న జనార్దనస్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. ఇక్కడ స్వామివారు నయనమనోహరంగా భక్తులకి దర్శనమిస్తారు.
ప్రతి మంగళవారం, శ్రావణ మంగళవారాలలో అమ్మవారికి విశేష పూజలు, వ్రతాలు చేస్తారు. ఇంకా మహాశివరాత్రి, కార్తీకమాసాలలో విశేష పూజలు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.