పరమ శివుడు లింగంగా వెలసిన అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రతి శివాలయానికి కూడా ఏదోఒక ప్రాముఖ్యత అనేది ఉంది. అలానే శివుడు ఇక్కడ వెలసిన శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి ఆ ప్రత్యేకత ఏంటి? ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ –కాశ్మీర్ లో గడ్డ కట్టే హిమ జలం ఉన్న లిడ్డర్ నదీ తీరాన 900 సంవత్సరాల ప్రాచీన శివాలయం ఉంది. దీని పూజారులు ముస్లిం లు అవటం విశేషం. కాశ్మీర్ లోయలో ఇదొక్కటే హిందూ దేవాలయం. కాశ్మీరీ పండిత కుటుంబాల వారు ఈ ఆలయ ఆలయ అర్చకత్వం చేసేవారు. ఉగ్రవాదుల దాడులు తీవ్రతరం అయ్యాక వారు ఈ గ్రామం వదిలి వలస వెళ్లి పోయారు. అప్పుడు దీనికి దగ్గరలో ఉన్న గ్రామం నుండి ఇద్దరు ముస్లిం పూజారులు మొహమ్మద్ అబ్దుల్లా ,గులాం హసన్ లు ఈ మహాలాకా దేవాలయం తలుపులు తీసి ,ఆలయ రక్షణ భారం వహించి అర్చకత్వం చేస్తూ ఘంటానాదం తో భక్తులను ఆకర్షించారు. నిత్యం హారతి నిస్తూ పవిత్రతను కాపాడుతున్నారు. ఈ ఆలయ శివలింగం మూడు అడుగుల నల్లరాతి శివలింగం. నిత్యం ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి భక్తులకు అందజేస్తున్నట్లు పూజారులు అబ్దుల్లా ,హసన్ లు ఆనందంగా తెలియ జేశారు .రాజా జయ సూర్య నిర్మించిన ఈ ఆలయం దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలో ఉన్న అమరానాథ్ దేవాలయ యాత్రికులకు మార్గాయాసం తీర్చుకొనే విశ్రాంతి మందిరం గా ఉపయోగ పడుతుంది. పూర్వం ఈ ఆలయ అర్చక రక్షణ బాధ్యతలు స్థానిక కాశ్మీర్ పండిట్ కుటుంబాల సంస్థ కు చెందిన పండిట్ రాదా కిషన్ చూస్తూ ఉండేవాడు. 19 89లో రాధా కిషన్ పండిట్ వలస వెళ్లి పోయినప్పుడు ఈ ఆలయం రాష్ట్ర పురాతత్వ సంస్థ ఆధీనం లో కి చేరింది . పండిట్ వలస వెడుతూ ఆలయ బాధ్యతను తన ముస్లిం స్నేహితుడు అబ్దుల్ భట్ కు అప్పగించి ,ఆలయ ద్వారాలు ఎప్పుడూ తెరచి ఉండేట్లు చూడమని కోరాడు. స్నేహితుడికిచ్చిన వాగ్దానాన్ని భట్ 2004లో ఆ ప్రాంతం నుండి వేరొక చోటుకు బదిలీ అయ్యేదాకా కాపాడాడు. ఆ తర్వాత మొహమ్మద్ అబ్దుల్లా , గులాం హసన్ లు ఆలయ బాధ్యతలు స్వీకరించి ప్రాణ ప్రదంగా కాపాడుతున్నారు.ఈ ముస్లిం శివభక్త పూజారులు మాకు శివునిపై అత్యంత భక్తీ ,విశ్వాసాలున్నాయి .ఆలయ నిర్వహణ బాధ్యత వహించటమేకాదు, అవసరమైన మరమ్మత్తులు కూడా చేస్తున్నాం. ఉగ్రవాదుల బెదిరింపులు , భయోత్పాతం ఉన్నప్పటికీ ఆలయాన్ని చక్కగా సమర్ధవంతంగా నిర్వహిస్తూ , భక్తుల సందర్శనకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నామన్న సంతృప్తి మాకు ఉన్నది అని చెబుతున్నారు. మా స్నేహితుడు తమ ఇష్టదైవమైన శివుని ఆలయ విషయమై మాకు అప్పగించిన బాధ్యత మేము అత్యంత విశ్వాసంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడి అర్చకులైన ఆ కాశ్మీర్ పండిట్ లు మళ్ళీ ఇక్కడికి వచ్చి వారి బాధ్యతలను వారు మరల చేబట్టాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాం . దానికి తగిన పరిస్టితులు, శాతి భద్రతలు త్వరలోనే ఏర్పడుతాయని నమ్ముతున్నాం అన్నారు .ఈ ఆలయం లో గణేష్ , పార్వతీదేవి , హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. సహజ సిద్ధ జలపాత౦ కూడా ఉండి, యాత్రికులను ఆకర్షించే దేవాలయం ఇది . ఈ దేవాలయానికి నాలుగేళ్ల నుండి భక్తుల రాక బాగా పెరిగింది .ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిన కాశ్మీర్ పండిట్ కుటుంబాలవారు కూడా యాత్రికులలాగా వచ్చి ఆలయాన్ని సందర్శించి వెడుతున్నారు .ఈ మహా లాకా దేవాలయం ఇలా స్నేహ ధర్మానికి , స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకొంటున్న విశ్వాసానికి ప్రతీకగా, హిందూ ముస్లిం సమైక్యతకు సాక్షంగా ఈ శివాలయం ఉండటం ఒక గొప్ప విశేషంగా భావిస్తున్నారు.